తెలంగాణ : రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్ఫూర్తినిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రూ.15 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. స్కూల్లో డిజిటల్ క్లాస్రూమ్స్, లైబ్రరీ, ల్యాబ్స్, అత్యాధునిక కిచెన్, డైనింగ్ హాల్ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసిన మైదానంలో సరదాగా విద్యార్థులతో ఫుట్బాల్ ఆడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్ర బడ్జెట్లో దాదాపు రూ.27 వేల కోట్లు విద్యాశాఖపైనే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై తల్లిదండ్రుల్లో అపోహలు ఉన్నాయి. అందరి అపోహలు తొలగించేందుకే టీపీఎస్ నిర్మాణం చేపట్టాం. విద్య మాత్రమే మన జీవితాలను సమూలంగా మార్చగలదు. సమాజంలో అసమానతలు పోవాలంటే అందరికీ నాణ్యమైన విద్య అవసరం. ప్రభుత్వ బడుల్లో చదవడం నామోషీ అనే ఆలోచన పోవాలి. ఇక్కడ చదివి ఐఏఎస్, ఐపీఎస్, సీఎంలు అయినవాళ్లు ఉన్నారు. గత ప్రభుత్వం వర్గానికొక స్కూల్ పెట్టి.. కుల వ్యవస్థను ప్రోత్సహించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటూ పాఠశాలలు పెట్టింది. కుల వ్యవస్థను నిర్మూలించేందుకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తాం. త్వరలోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తాం. క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపేందుకు మెస్సీని హైదరాబాద్కు తీసుకొస్తే విమర్శలు చేశారు. గత ప్రభుత్వం యూనిఫామ్లు ఇస్తే.. అవి నెలరోజులకే చిరిగాయి. ఈ ప్రభుత్వం నాణ్యమైన వస్తువులతో విద్యా కిట్ ఇస్తోంది. విద్యాకిట్ల పంపిణీ కోసం రూ.680 కోట్లతో టెండర్లు పిలిచాం. రూ.680 కోట్ల టెండర్లలో రూ.2వేల కోట్ల స్కామ్ జరిగిందని ఒకాయన అంటున్నారు.. ఎలా సాధ్యమో చెప్పాలి. విద్యారంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతాం’’ అని సిఎం అన్నారు.
ప్రభుత్వ బడుల్లో చదవడం నామోషీ అనే ఆలోచన పోవాలి : సిఎం రేవంత్ రెడ్డి
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 17, 2026, 01:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)