సింటర్ ప్లాంట్ ఇప్పటికే టాటా సంస్థకు ధారాదత్తం
ప్రమాదపుటంచున కార్మికుల విధులు
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో : విశాఖ ఉక్కు కర్మాగారంలో గుట్టుచప్పుడు కాకుండా టోటల్ ఆపరేషన్ మెయింటినెన్స్ కాంట్రాక్టు (టిఒఎంసి) సిస్టమ్ను ఉక్కు యాజమాన్యం వేగవంతం చేస్తోంది. కేంద్రంలోని మోడీ సర్కారు డైరెక్షన్లో సదరు చర్యలతో పరోక్షంగా ఉక్కు పరిశ్రమలోని వివిధ విభాగాలపై ఇప్పటికే దాడికి దిగింది. ఈ టిఒఎంసి ద్వారా బడా కాంట్రాక్టు సంస్థలకు పలు విభాగాలు ధారాదత్తం అవుతాయి. అంతేగాక కొత్తగా రిక్రూట్మెంట్కు ఆస్కారం ఉండదు. పర్మినెంట్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించేందుకు ఆ కాంట్రాక్టు టెండరులో ఓ అంశాన్ని పేర్కొనడంతో కార్మికులు తీవ్ర స్థాయిలో ఆవేదనకు గురవుతున్నారు. ఇంకా ఏన్నాళ్లు ఏ హక్కులూ లేకుండా పనిచేయాలని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలోని టిడిపి కూటమి సర్కారుకు ఇవేమీ పట్టడం లేదు. గతంలో ప్లాంట్లో టిఎంసి (టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టు) విధానం ఉండేది. దీంట్లోనూ కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంతో ఉత్పత్తి చేసే విభాగాలు కునారిల్లిపోయాయి. తాజాగా బడా కంపెనీలను రంగంలోకి దించుతున్నారు. దీనికి సంబంధించి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఇఒఐ)లను పిలవడంతో ప్లాంట్లోని సింటర్ ప్లాంట్ను టాటా సంస్థ ఇప్పటికే దక్కించుకుంది. ఇంకా అనేక సంస్థల జాబితాను యాజమాన్యం ప్రకటించడం లేదు.
కునారిల్లుతున్న పలు విభాగాలు
ఇప్పటికే కోక్ ఒవెన్, ఆర్ఎంహెచ్పి, పవర్ ప్లాంట్, సింటర్ ప్లాంట్, బ్లాస్ట్ ఫర్నేస్లలో సరైన మెయింటినెన్స్ లేదు. రస్ట్ క్లియరెన్స్ లేక ఉత్పత్తిపైనా, ప్లాంట్ విభాగాల సామర్థ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. నేటికీ కార్మికుల జీతాలకు సంబంధించి రూ.రూ.860 కోట్ల బకాయిలు ఉన్నాయి. అవి రాక వారంతా ఇబ్బంది పడుతున్నారు. పైన తెలిపిన విభాగాల్లో రస్ట్ క్లీనింగ్ లేకపోవడంతో అది ఎప్పుడు ఏ విభాగంలో మెటీరియల్ మీద పడుతుందోనన్న ఆందోళనలో కార్మికులు భయపడుతూ పని చేస్తున్నారు. ప్రస్తుతం అమలు చేసేందుకు సిద్ధమవుతున్న టిఒఎంసితో ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులను కొనసాగించడానికి వీలు పడదు. ఆ విధంగా టెండరులోనే పేర్కొన్నారు. గత టిఎంసి కాంట్రాక్టు సిస్టంలో యూనియన్లు సాధించిన హక్కు ప్రకారం పర్మినెంట్ కార్మికుల్లో 50 శాతం, నిర్వాసితుల నుంచి 50 శాతం ర్రికూట్మెంట్లో స్థానం ఉండేది. తాజా టెండర్లతో వీటిని ఉక్కు యాజమాన్యం రద్దుచేసింది. ఇప్పటికే బడా కాంట్రాక్టర్లు ఇతర రాష్ట్రాల నుంచి హిందీ మాట్లాడేవారిని పనిలోకి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు టిఒఎంసి విధానమొస్తే పరిశ్రమలోగల ఆపరేషన్స్ అన్నీ బడా కాంట్రాక్టు సంస్థల చేతిలోకి వెళ్లి ప్లాంట్ ప్రైవేటీకరణకు మార్గం మరింత సుగుమం కానుంది.









కామెంట్లు (0)