కోల్ కతా : కోట్లాది రూపాయల ప్రాథమిక ఉపాధ్యాయుల నియామక కుంభకోణం కేసులో టిఎంసి ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సోమవారం ఉదయం ఈడి విచారణకు హాజరయ్యారు. ఈ నెల ప్రారంభంలో .. విచారణకు హాజరుకావాల్సిందిగా అభిషేక్ బెనర్జీకి ఈడి సమన్లు జారీ చేసింది. ప్రాథమిక ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై ఈడి జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఈ సమన్లు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక అవకతవకలు, విధానపరమైన ఉల్లంఘనలు జరిగినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అభిషేక్ బెనర్జీ సంతకాల ఫోర్జరీ కేసులో ఆదివారం సిఐడి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.
పశ్చిమబెంగాల్ సెంట్రల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ ఎస్ సి) అసిస్టెంట్ టీచర్ రిక్రూట్ మెంట్ స్కామ్ ( 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు)కు సంబంధించి, మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 నిబంధనల ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో ఈడి సుమారు రూ.57.78 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసిన ఐదు నెలల తర్వాత సమన్లు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీని అదుపులోకి తీసుకుంది. ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ నివాసంలో ఈడి సోదాలు చేపట్టింది. సుమారు రూ.50 కోట్లకు పైగా నగదు, రూ.4.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుంది.
నియామక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందంటూ గతేడాది ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ.. 25,000 మందికి పైగా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన నేరాలకు గాను ఈడి ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఇసిఐఆర్)ను దాఖలు చేసింది. అలాగే అవినీతి నిరోధక చట్టంతో సహా భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద సిబిఐ కేసు కూడా నమోదు చేసింది.









కామెంట్లు (0)