ప్రజాశక్తి-చిత్తూరు : జిల్లాలో తోతాపురి మామిడి సాగు రైతులు పండ్లను పూర్తిగా పరిపక్వ దశకు వచ్చిన తరువాత మాత్రమే కోయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంచి ధరలు పొందేందుకు రైతులు తోటల్లో ఒకేసారి కోతకు బదులుగా దశలవారీగా (స్టాగర్డ్ హార్వెస్టింగ్) పంట కోత చేపట్టాలని తెలిపారు. జిల్లాలోని పల్ప్ యూనిట్లు ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకు తోతాపురి మామిడి పండ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో రైతులు తొందరపడి పంటను విక్రయించకుండా మార్కెట్ పరిస్థితులను పరిశీలించి దశలవారీగా విక్రయాలు జరపవచ్చన్నారు. అలాగే తోటల్లో పండ్ల ఈగ (ఫ్రూట్ ఫ్లై) సమస్యను నివారించేందుకు రైతులు భారత ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) సూచించిన మిథైల్ యూజినాల్ ట్రాప్లను ఏర్పాటు చేసి తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. మరోవైపు జిల్లాలోని పల్ప్ యూనిట్లు తోతాపురి మామిడి పండ్ల కొనుగోలులో స్థానిక రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. రైతులు నాణ్యమైన పండ్ల ఉత్పత్తి, సరైన కోత నిర్వహణ ద్వారా మెరుగైన ఆదాయం పొందాలని ఆకాంక్షించారు.
తోతాపురి మామిడి రైతులు పరిపక్వ దశలోనే కోత చేపట్టాలి : జిల్లా కలెక్టర్
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 10, 2026, 03:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)