ఐపిఎల్ : ఐపిఎల్ 2026 సీజన్లో ప్లేఆఫ్స్ పోటీ ఉత్కంఠభరితంగా కొనసాగుతుండటంతో మ్యాచ్లను ప్రత్యక్షంగా చూడటానికి అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. స్టేడియాల్లో మ్యాచ్లు చూడాలనే ఉత్సాహం పెరగడం కొందరికి అక్రమంగా డబ్బులు సంపాదించే అవకాశంగా మారింది. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్కు టికెట్ ధరలను ఎస్ఆర్హెచ్ యాజమాన్యం గణనీయంగా పెంచిన విషయం తెలిసిందే. మరోవైపు, నకిలీ యాప్ల ద్వారా అభిమానులను మోసం చేసి డబ్బులు దోచుకునే ఘటనలూ వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ – ఆర్సీబీ మ్యాచ్ టికెట్ల వ్యవహారంపై కొత్త విషయాలు వెలుగుచూశాయి.
ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్లోని కొంతమంది ఉన్నతాధికారులు కాంప్లిమెంటరీ టికెట్ల అక్రమ విక్రయాల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు వెయ్యి కాంప్లిమెంటరీ టికెట్లు అనధికారికంగా అమ్ముడైనట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని టికెట్లు ఒక్కొక్కటీ రూ.80 వేల వరకు విక్రయించబడినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ – బెంగళూరు మ్యాచ్కు ముందు స్టేడియం బయట టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ముకీమ్, గుర్ఫాన్, ఫైసల్లను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం విచారణలో భాగంగా పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న పంకజ్ యాదవ్ను కూడా అరెస్ట్ చేశారు.
కోహ్లీ కోసమేనా ?
ఈ బ్లాక్ టికెట్ వ్యవహారం వెనుక ఢిల్లీ క్రికెట్ బోర్డుకు చెందిన ఓ అధికారి ప్రమేయం ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు సీనియర్ అధికారులతో పాటు నలుగురు డీడీసీఏ సిబ్బందిని పోలీసులు దాదాపు ఐదు గంటలపాటు విచారించినట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం …. ఢిల్లీతో జరిగిన ఆర్సీబీ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అతడిని ప్రత్యక్షంగా చూడాలనే ఉత్సాహంతో అభిమానులు భారీగా టికెట్ల కోసం పోటీ పడటంతో, కొన్ని టికెట్లు రూ.80 వేల వరకూ అమ్ముడైనట్లు గుర్తించారు.









కామెంట్లు (0)