ప్రజాశక్తి , విజయనగరం కోట : బొండపల్లి మండలం కిండాంఅగ్రహారం రెవెన్యూ పరిధిలో కిండాంఅగ్రహారం,రాచకిండాం, కొండకిండాం గ్రామాల్లో బలవంతపు భూ సేకరణ ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ కోరారు. ఈ మేరకు సోమవారం ఆయా గ్రామాల ప్రజలు కలెక్టర్లకు భూ సేకరణ ఆపాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం విజయనగరం కలెక్టరేట్ ముందు ఆయా గ్రామాల రైతులతో ఆందోళన చేశారు. ఈ సందర్భంగాసిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఇప్పటికే గ్రామంలో ఎం ఎం ఎస్ ఎం ఈ పార్క్ కోసం 150 ఎకరాలు తీసుకొని ఏ రకమైన పార్క్ ను నిర్మించలేదని , ఇప్పుడు మరలా ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టు పేరుతో రైతుల వద్ద నుండి 175 ఎకరాల భూమిని కాజేసీ రియల్ ఎస్టేట్ లకు అప్పజెప్పాలని చూస్తున్నారని ఆరోపించారు. కేవలం 10 సెంట్లు 20 సెంట్లు, ఆరెకరా మాత్రమే భూములు ఉన్న చిన్న,సన్నకారు రైతులను నిర్వాసితులను చేయాలని ప్రభుత్వం చూస్తుందని అన్నారు. రెవిన్యూ అధికారులు రైతులను భయభ్రాంతులకు గురిచేసి బలవంతపు భూసేకరణ చేసేందుకు పూనుకోవడం దుర్మార్గమైన చర్యని అన్నారు. రైతులపై బెదిరింపులు ఆపి ఎం ఎం ఎస్ ఎం ఈ పార్కు కోసం ఇచ్చిన భూముల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టు నిర్మిస్తే సరిపోతుందని అన్నారు. దానికి రైతులు అడ్డు తగలరని తెలిపారు. ఇప్పటికే వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం జిల్లాలో తీసుకున్న భూముల్లో ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, జిల్లాలో భూములు తీసుకున్న భోగాపురం ఎయిర్పోర్ట్, జిందాల్ తదితర చోట్ల ప్రజలకు ఏ రకమైన ఉపాధిని చూపలేదని అన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ కలుగజేసుకొని రైతులు బలవంతపు భూసేకరణను నిలిపివేసేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ గోపాలం, బి .రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
బలవంతపు భూ సేకరణ ఆపాలంటూ కలెక్టర్లకు వినతి పత్రాలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 08, 2026, 02:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)