తిరువనంతపురం: కేరళ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికలలో ఎస్ఎఫ్ఐ ఘన విజయం సాధించిన అనంతరం నిర్వహించిన విజయోత్సవ ర్యాలీపై కేఎస్యూ (ఎన్ఎస్యూఐ) కార్యకర్తలు హింసాత్మక దాడికి పాల్పడ్డారని ఎస్ఎఫ్ఐ తెలిపింది. రాళ్లు, కర్రలతో జరిగిన ఈ దాడిలో ఎస్ఎఫ్ఐ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శివప్రసాద్ సహా పలువురు కార్యకర్తలు గాయపడినట్లు తెలిపింది. కొందరు మీడియా ప్రతినిధులపై కూడా దాడి జరిగినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సిన రాష్ట్ర పోలీసులు కేఎస్యూ దుండగులను అడ్డుకోకపోగా, కొన్ని సందర్భాల్లో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపైనే దాడులకు పాల్పడ్డారని ఎస్ఎఫ్ఐ నేతలు ఆగ్రహించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో సాధించిన విద్యార్థి విజయాన్ని అంగీకరించలేక కేఎస్యూ హింసకు దిగిందని ఎస్ఎఫ్ఐ పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం, హోం శాఖ వైఖరిపై కూడా ఎస్ఎఫ్ఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “పోలీసుల రక్షణలో కేఎస్యూ గూండాలను ఉపయోగించి ఎస్ఎఫ్ఐని అణచివేయగలమని ప్రభుత్వం భావిస్తే, అలాంటి ప్రతి ప్రయత్నాన్ని విద్యార్థి ఉద్యమం బలంగా ప్రతిఘటిస్తుంది” అని ఎస్ఎఫ్ఐ నేతలు హెచ్చరించారు. ఈ దాడిని, అలాగే రాష్ట్ర పోలీసుల బాధ్యతారహిత వైఖరిని నిరసిస్తూ రేపు కేరళ రాష్ట్ర సచివాలయం వరకు భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఐ ప్రకటించింది.
గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్, ఎం.వి. జయరాజన్ పరామర్శించారు. కేఎస్యూ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.









కామెంట్లు (0)