అతిక్రమిస్తే కఠిన చర్యలు
డీలర్లకు సర్కారు వార్నింగ్
జిల్లాల్లో వ్యవసాయాధికారుల స్పెషల్ డ్రైవ్
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఖరీఫ్లో రైతులతో యూరియా, డిఎపి ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ (స్పెషల్ డ్రైవ్) ప్రారంభించింది. గతేడాది అమ్మకాల కంటే తక్కువ మొత్తంలో రైతులకు ఎరువులను విక్రయించాలని హోల్సేల్, రిటైల్ డీలర్లకు ఆంక్షలు విధిస్తోంది. తమ వద్ద నిల్వలు ఉన్నప్పటికీ నిరుడు అమ్మినదానికంటే ఎంతమాత్రం ఎక్కువ అమ్మవద్దని హెచ్చరిస్తోంది. ఒకవేళ రైతులు అడిగినా సముదాయించి తర్వాత రావాలనిచెప్పి తిప్పి పంపాలని సూచిస్తోంది. తమ వద్ద స్టాక్ లేదని చెప్పాలని సలహా ఇస్తోంది. తమ ఆదేశాలను అతిక్రమిస్తే లైసెన్స్ల సస్పెన్షన్, లైసెన్స్ల రద్దు, బ్లాక్ లిస్టు, కేసుల నమోదు వంటి కఠిన చర్యలు చేపడతామని హెచ్చరిస్తోంది. దుకాణదారులు తాము విక్రయించిన రైతులకు సంబంధించిన ఆధార్, ఫోన్నెంబర్, పట్టాదార్ ప్యాస్ పుస్తకం, ఇతర భూమి అధీకృత సమాచారం, డిబిటి డేటా, ఏ పంట వేయడానికి కొనుగోలు చేసింది… తదితర సమగ్ర వివరాలను తమకు అందజేయాల్సి ఉంటుందని పేర్కొంటోంది. రైతులకు ఇస్తున్న ఎరువుల సబ్సిడీని ఎలాగైనాసరే తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని దారులూ తొక్కుతోంది. అమ్మకాలు, వినియోగంపై నిఘా పెట్టాలని ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో ఎరువుల వాడకం తగ్గాల్సి ఉండగా 2025-26లో పెరిగిందని చెప్పి, 2026-27లో తగ్గించాలని నిర్దేశించింది. కేంద్రం ఆదేశాలతో రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం నిఘాను ముమ్మరం చేయడంతో పాటు అవగాహన పేరిట జిల్లాల్లో వ్యవసాయాధికారులతో డీలర్లను సమావేశపర్చి ఎరువుల అమ్మకాల తగ్గింపునకు స్పెషల్ డ్రైవ్ నడుపుతోంది. ఇప్పటికే రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో నాలుగైదు ప్రభుత్వ శాఖల అధికారులతో ఏప్రిల్లో ఎరువుల అమ్మకాలపై విచారణలు జరిపి పలు దుకాణదారులపై కేసుల నమోదు, లైసెన్స్ల రద్దు, ఫ్రీజ్ వంటి చర్యలకు పాల్పడింది. ఇంకోవైపు ఎపి అగ్రికల్చర్ ఇంటిగ్రేషన్ మేనేజ్మెంట్ సిస్టం యాప్ ద్వారా రైతులకు ఎరువులను విక్రయించాలని నిర్ణయించింది. రైతులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులిస్తామని ప్రకటించింది. ప్రభుత్వ ఈ చర్యలన్నీ మోడీ ప్రభుత్వం వద్ద లొంగుబాటును తెలుపుతు న్నాయని రైతుసంఘాలు, కొన్ని ప్రతిపక్ష పార్టీలు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. రైతులకు అవసరమైన ఎరువులను అదనుకు అందుబాటులో ఉంచేందుకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సిన టిడిపి ప్రభుత్వం, రైతుల ప్రయోజనాలకు కాకుండా రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తోం దంటు న్నారు. ఇదిలా ఉండగా 2025 ఖరీఫ్లో 7.50 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయని వెల్లడించిన వ్యవసాయశాఖ, 2026 ఖరీఫ్నకు సైతం అంతే మొత్తంలో కేటాయింపులు జరిగాయని తెలిపింది. గడచిన మూడు ఖరీఫ్ సగటు అమ్మకాలు 6.68 లక్షల టన్నులుగా పేర్కొంది. అలాగే డిఎపి నిరుడు ఖరీఫ్లో 2.47 లక్షల టన్నులు సేల్ అయింది. మూడు సీజన్ల సగటు వాడకం 2.28 లక్షల టన్నులు. ప్రస్తుత ఖరీఫ్నకు 2.50 లక్షల టన్నులు కేటాయించారు. కేంద్రం మూడేళ్ల సగటు కంటే కనీసం 10 శాతం మేర వినియోగం తగ్గాలంటోంది. కొన్ని పరిస్థితుల కారణంగా ఏటికేడు యూరియా వినియోగం కనీసం 5-10 శాతం వరకు పెరుగుతోంది. వాతావరణం అనుకూలించి సాగు విస్తీర్ణం పెరిగితే, పంటల సరళిలో మార్పులొస్తే అంచనాలు తప్పుతాయి. నిరుడు జరిగిందిదే. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పర్యవసానాలను పట్టించు కోకుండా ఎరువుల వాడకం తగ్గింపుపైనే దృష్టి సారించింది. బ్లాక్ మార్కెట్, పర్యావరణం, భూసారం పరిరక్షణ అంటోంది.









కామెంట్లు (0)