ప్రజాశక్తి-అమరావతి : టర్కీలోని అంటాల్యాలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-3 పోటీల్లో ధీరజ్ రెండు స్వర్ణ పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరపై ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు.. “బలమైన ప్రత్యర్థులపై అద్భుత ప్రదర్శన కనబర్చి ధీరజ్ సాధించిన ఈ విజయం రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికి గర్వకారణం. ఈ ఘనత ఎందరో యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది” అని పేర్కొన్నారు. ధీరజ్తో పాటు కుంకుమ్ మోహోద్ను, భారత బృందాన్ని కూడా ఆయన అభినందించారు.
ఈ టోర్నీలో ధీరజ్.. మిక్స్డ్ టీమ్ విభాగంలో కుంకుమ్ అనిల్ మోహోద్తో కలిసి దక్షిణ కొరియా అగ్రశ్రేణి జోడీని ఓడించి స్వర్ణం కైవసం చేసుకున్నారు. అనంతరం అదే రోజు జరిగిన పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఫైనల్లో ఒలింపిక్ పతక విజేత లీ వూ-సియోక్పై 7-3 తేడాతో ఘనవిజయం సాధించి, తన కెరీర్లో తొలి వ్యక్తిగత వరల్డ్ కప్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఒక భారతీయ పురుష ఆర్చర్ వరల్డ్ కప్లో వ్యక్తిగత స్వర్ణ పతకం సాధించాడు.









కామెంట్లు (0)