ముఖ్యమంత్రి జోక్యంతో సమస్య పరిష్కరించాలి : కెవిపిఎస్
విజయవాడ : రాష్ట్రంలో MSME పథకాల కింద పరిశ్రమలు స్థాపించిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీలు ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉండటం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి పేర్కొన్నారు. ఈ మేరకు పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్, ఐఏఎస్ కి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. బుధవారం విజయవాడలోని అంబేద్కర్ భవనంలో విలేకరులతో అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ … రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన పథకాలపై విశ్వాసంతో అనేక మంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పరిశ్రమలు స్థాపించారని, అయితే పథకం ప్రకారం అందాల్సిన సబ్సిడీలు ఇప్పటికీ విడుదల కాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బ్యాంకు రుణాలపై అధిక వడ్డీలు చెల్లిస్తూ వ్యాపారాలను కొనసాగించడం పారిశ్రామికవేత్తలకు భారంగా మారిందని, కొందరు పరిశ్రమలను మూసివేసే పరిస్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు సకాలంలో అందకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అభివృద్ధి దెబ్బతింటోందని పేర్కొన్నారు. అందువల్ల పెండింగ్లో ఉన్న అన్ని సబ్సిడీలను తక్షణమే విడుదల చేయాలని, ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక చొరవతో సమస్యను పరిష్కరించాలని కెవిపిఎస్ డిమాండ్ చేసింది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా బలోపేతం కావడం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఎంతో అవసరమని, ప్రభుత్వం ఈ సమస్యపై వెంటనే స్పందించాలని కోరింది.









కామెంట్లు (0)