న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం ప్రజల నెత్తిన మరో పిడుగు వేసింది. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు 90 పైసలు పెంచినట్లు మంగళవారం ప్రకటించింది. పెంచిన ధరలు నేటి నుండి అమల్లోకి రానున్నట్లు కేంద్రం ప్రకటించింది. మే 15న పెట్రోల్, డీజిల్ ధరలపై మూడు రూపాయిల మేర పెంచిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల వ్యవధిలో రెండవసారి ధరలను పెంచడం గమనార్హం. తాజా పెంపుతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు సుమారు 3.90 పెరిగాయి.
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 87 పైసలు పెరిగి లీటరుకు రూ.98.64కి చేరగా, డీజిల్ ధర 91 పైసలు పెరిగి లీటరుకు రూ.91.58కి చేరంది.ముంబయిలో పెట్రోల్ ధర 81 పైసలు పెరిగి, ప్రస్తుతం లీటరుకు ₹107.49కి విక్రయిస్తుండగా, డీజిల్ ధర 88 పైసలు పెరిగి లీటరుకు ₹94.02కి చేరింది.చెన్నైలో పెట్రోల్ ధర 82 పైసలు, డీజిల్ ధర 86 పైసలు పెరిగాయి. ప్రస్తుతం వాటి ధరలు వరుసగా లీటరుకు ₹104.49, ₹96.11 గా ఉన్నాయి. ఢిల్లీ, ముంబయి, చెన్నైతో పోలిస్తే , కోల్ కతాలో వీటి ధర అత్యధికంగా ఉంది. కోల్ కతాలో పెట్రోల్ ధర 96 పైసలు పెరిగి లీటరు రూ.109.70కి చేరగా, డీజిల్ ధర 94 పైసలు పెరిగి లీటరు రూ.96.07కి చేరింది.
ఇటీవల వాహనాలకు వినియోగించే సిఎన్ జి (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ )ధరను పెంచింది. కిలో సిఎన్జిపై ఒక్క రూపాయి ధర పెంచుతూ మే 18న నిర్ణయం తీసుకుంది. రెండు, మూడు రోజుల క్రితం పెట్రో, డీజిల్ ధరల పెంపు సందర్భంగా సిఎన్జిపై కూడా కిలోకు రెండు రూపాయలు పెంచింది. తాజాగా మరోసారి రూపాయి పెంచడంతో సిఎన్జిపై కూడా మూడు రూపాయలు పెంచినట్లయ్యింది. దీంతో వాహనదారులతో పాటు, ఆటో, క్యాబ్ డ్రైవర్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.









కామెంట్లు (0)