తెలంగాణ : నీట్ పరీక్షలో అక్రమాలకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆదివారం భారీ నిరసన చేపట్టింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. నీట్ పేపర్ లీకేజీ వివాదం, సీబీఎస్ఈ (CBSE) ఆన్-స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్లో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో…. పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇందులో భాగంగా నేడు హైదరాబాద్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) భారీ నిరసనను చేపట్టింది. ఇందులో పలు విద్యార్థి, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఎన్టీఏకు వ్యతిరేకంగా నిరసన స్వరాన్ని వినిపించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, యువత, విద్యావేత్తలు భారీ సంఖ్యలో ధర్నా చౌక్కు తరలివచ్చారు. “మాకు న్యాయం కావాలి” (We Want Justice), “ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి” అంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు చేతబూని కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రముఖ సామాజిక కార్యకర్త, మెగసేసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్చుక్ తన మద్దతును ప్రకటించారు. హైదరాబాద్ ధర్నా చౌక్లో జరుగుతున్న ఈ సభను ఉద్దేశించి తాను ప్రసంగించబోతున్నట్లు ఆయన స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ ధర్నాలో రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వర్ పాల్గొన్నారు. ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శాంతియుత ధర్నాకు ఆదివారం మధ్యాహ్నం వరకు మాత్రమే అధికారికంగా అనుమతి ఇచ్చినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. సమయం ముగిసేలోపు నిరసనకారులను పంపించే దిశగా అదనపు బలగాలను రంగంలోకి దించారు.
కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన ప్రదర్శన
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 14, 2026, 04:25 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం







కామెంట్లు (0)