న్యూఢిల్లీ : దేశ సార్వభౌమాధికారాన్ని, అంతర్జాతీయ ప్రతిష్టను మోడీ ప్రభుత్వం దిగజార్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శించారు. ఒమన్ తీరంలో అమెరికా సైనిక దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటనపై ప్రధాని మోడీ మౌనం వహించడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ఈ ఘటన జరిగి మూడు రోజులు గడిచినా ప్రధాని నుండి కనీసం ఒక సంతాప సందేశం గాని లేదా బహిరంగ ప్రకటన గాని వెలువడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా దాడుల్లో మరణించిన వారి మృతదేహాలు భారత్ కి చేరుకుంటున్న నేపథ్యంలో ఆదివారం ఆయన ఎక్స్ లో ఘాటుగా స్పందించారు. గతంలో అలీన విధానాన్ని అనుసరిస్తూ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకున్నప్పుడే భారత్ నిజమైన ‘విశ్వగురువు’గా ఉండేదని, ప్రస్తుతం మోడీ ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని విమర్శించారు. విదేశాంగ విధానాల విషయంలో భారతీయుల ప్రాణాలను తేలికగా తీసుకోకూడదని, జవాబుదారీతనానికి మౌనం ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాదని ఖర్గే స్పష్టం చేశారు.
ఈ అంశంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ప్రధాని మోడీపై మండిపడ్డారు. అమెరికా దాడుల్లో మన దేశ పౌరులు మరణిస్తే, ఆ దేశాన్ని గట్టిగా నిలదీయాల్సింది పోయి వారి బెదిరింపులకు తలొగ్గుతున్నట్లు వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. పౌరులను, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో ప్రధాని మోడీ విఫలమయ్యారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.








కామెంట్లు (0)