పచ్చిరొట్ట విత్తనాల్లో చేతివాటం
అక్రమార్కుల జేబుల్లోకి నిధులు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి ప్రభుత్వం రాయితీపై విత్తనాలిస్తామంటే బహిరంగ మార్కెట్ ధర కంటే తక్కువకు వస్తాయని రైతులు ఆశిస్తారు. పెట్టుబడి కొంతైనా తగ్గుతుందని ఆశ పడతారు. ప్రభుత్వం యాభై శాతం రాయితీ ఇచ్చాక కూడా మార్కెట్ ధరలతో సమానంగా రాయితీ విత్తనాల ధరలుంటే? ఖరీఫ్లో భూసారం పెంపొందేందుకు, పంటల వైవిధ్యం కోసం సాగు చేసే పచ్చిరొట్ట పంట విత్తనాలకు సర్కార్ 50 శాతం రాయితీ ఇచ్చాక కూడా మార్కెట్ ధరలతో పోటీ పడుతున్నాయి. ప్రభుత్వంలోని కొందరి చేతివాటం వలన రైతులకు ప్రభుత్వ రాయితీ దక్కకుండా పోతోందని, ఆ మేరకు వారిపై ఆర్థిక భారం మోపుతున్నారని ఆరోపణలొస్తున్నాయి. పక్కదారి పడుతున్న, కొందరి జేబుల్లోకి అక్రమంగా చేరుతున్న ప్రభుత్వ నిధులు కనీసం రూ.40 కోట్ల వరకు ఉంటాయని అంచనా. స్కాం విలువ ఇంకా ఎక్కువేన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జీలుగ, జనుము, పిల్లిపెసర.. ఈ మూడూ కలుపుకొని 91 వేల క్వింటాళ్ల గ్రీన్మెన్యూర్ విత్తనాలను ఈ ఖరీఫ్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రూ.62 కోట్లు. అత్యధికంగా జీలుగ 50 వేల క్వింటాళ్లు, జనుము 21 వేల క్వింటాళ్లు, పిల్లిపెసర 20 వేల క్వింటాళ్లు. ఐదెకరాల పరిమితితో రాయితీ విత్తనాలిస్తామన్నారు. ఒక ఎకరా సాగుకు సరిపడ కాకుండా కొంత మేరకే ఇస్తామంటున్నారు. నిర్ణీత పరిమాణంలో ప్యాకెట్లు కట్టి రైతులకు పంపిణీ చేసేందుకు ఎపి సీడ్స్ సిద్ధం చేసింది. కాగా జీలుగ కిలో విత్తనం మార్కెట్లో గరిష్టంగా రూ.వంద వరకు ఉంది. అదే పెద్ద మొత్తంలో (బల్క్గా) తీసుకుంటే ఆ రేటు కంటే తక్కువకు దొరుకుతున్నాయి. ప్రభుత్వం యాభై శాతంశాతం సబ్సిడీ పోను రైతుకు ఎపి సీడ్స్ సరఫరా ధర రూ.80. రైతుల నుంచి సేకరణ ధర, రవాణా, లేబుల్, ప్యాకింగ్, అమాంబాపతు ఖర్చులన్నీ కలుపుకొని కిలో సేల్ ప్రైస్ రూ.160గా నిర్ణయించి రూ.80 సబ్సిడీ ఇచ్చి, రైతులకు రూ.80కి అమ్మకానికి పెట్టారు. జనుము మార్కెట్లో కిలో ధర రూ.70 వరకు ఉండగా, సబ్సిడీ ఇచ్చాక రూ.77 కు రైతులకు ధర నిర్ణయించారు. పిల్లిపెసర కిలో మార్కెట్లో రూ.150 లోపు ఉండగా 50 శాతం రాయితీ పోను రైతులకు రూ.98 పై సరఫరా చేస్తున్నారు.








కామెంట్లు (0)