విజయవాడ : మున్సిపల్ సర్వీసులను ప్రైవేటీకరించే జిఒ 975 ను తక్షణం ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో ఎపి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ …. స్టేట్ గవర్నమెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు జిఒ విడుదల చేశారనీ, ఆ తరువాత మున్సిపల్ కమిషనర్ అన్ని మున్సిపాలిటీలకు ఒక మెమో కూడా పంపారని తెలిపారు. జిఒ ఎంఎస్ నెంబర్ జిఒ ఆర్టి నెంబర్ 975 పేరుతో మొత్తం 14 రకాల మున్సిపల్ సేవలన్నిటినీ ప్రైవేటుపరం చేస్తూ పిపిపి కింద ప్రభుత్వం జిఒ జారీ చేసి చాలావరకు మున్సిపాలిటీని ప్రైవేటీకరించిందన్నారు. ఎన్నికలయ్యాయనీ.. పాలకవర్గాలు లేవనీ … అధికారుల పర్యవేక్షణలోనే మున్సిపాలిటీ నడుస్తుందన్నారు. ఇప్పుడు పిపిపి లు వచ్చిన తరువాత అన్ని సేవలు ప్రైవేటుపరం అయిన తరువాత ఎన్నికలు పెట్టి ప్రజాప్రతినిధులు, చైర్ పర్సన్లు వచ్చినా … చేయగలిగిందేమీ లేదన్నారు. కాబట్టి 975 జిఒ ఆర్టి నెంబర్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా ప్రైవేటీకరించి యూజర్ల ఛార్జీల పేరుతో ప్రజలపై వేల కోట్ల రూపాయల భారాలను వేస్తే వారు ఎలా భరించగలరు ? అని ప్రశ్నించారు. ఈ జిఒ వల్ల మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులకు కూడా వారి ఉపాధికి భద్రత ఉండదు అని చెప్పారు. ప్రైవేటు వ్యక్తులు యంత్రాలను పెట్టుకొని కొద్దిమందితో పనిచేయించుకుంటారని, దాని ఫలితంగా మిగతావారి ఉద్యోగాలకు ముప్పు వస్తుందని తెలిపారు. మున్సిపల్ సర్వీసులను ప్రైవేటీకరించే జిఒ 975 ను తక్షణం ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ యూనియన్లు, ప్రజలు, పౌర సంఘాలు కలిసి దీన్ని ప్రతిఘటించడానికి ఉద్యమాలు చేపడతారని హెచ్చరించారు. ప్రభుత్వం దీనిపై స్పందించాలని వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
CPIM PressMeet – జిఒ 975 ను తక్షణం ఉపసంహరించుకోవాలి : వి.శ్రీనివాసరావు
01 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 01, 2026, 12:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)