‘ఇండియా’ను బలహీనపర్చే వైఖరి సరికాదు
న్యూఢిల్లీ:కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి)కి ‘సహాయకారి’గా వ్యవహరించడం రాహుల్ గాంధీ మానుకోవాలని హితవు పలికారు. ఇటీవల జరిగిన ప్రతిపక్షాల ఐక్య వేదిక ‘ఇండియా’ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పినరయి విజయన్తో తనకు రాజకీయ విభేదాలున్నాయని, అందుకే తాను ఆయనను "కౌగిలించుకోలేనని" (మద్దతు తెలపలేనని) వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎంఎ బేబీ సామాజిక మాధ్యమాల్లో శనివారం నాడు ఒక పోస్టు చేశారు. ఇటీవల జరిగిన కేరళం అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిపిఎం, బిజెపి మధ్య రహస్య ఒప్పందం ఉందంటూ రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారు. దీనిపై సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్ తదితర వామపక్ష నాయకులు ‘ఇండియా’ సమావేశంలో నిలదీశారు. దీనిపై స్పందించిన రాహుల్.. ‘ఇండిమా బ్లాక్’ పక్షాల మధ్య అనైక్యత ఉందంటూ బిజెపి ప్రచారం చేస్తోందన్నారు. అదే సమయంలో తాను పినరయ్ విజయన్తో రాజకీయ పోరాటం చేస్తున్నానని, ఆయనను కౌగలించుకోవాల్సిన అవసరం లేదని విపరీత వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలను నాటి సమావేశంలోనే జాన్బ్రిట్టాస్ ఖండించారు. అంతకు ముందు ఇదే తప్పుడు ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గేకు ఎంఎ బేబీ లేఖ ద్వారా నిరసన తెలిపారు. అందులో రాహుల్ ప్రవర్తన, ఆయన వ్యాఖ్యలు భాగస్వామ్య పక్షాల మధ్య ఉండాల్సిన సహకార స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని బేబీ పునరుద్ఘాటించారు. బిజెపిని ఎదుర్కోవడానికి అందరం కలిసి వచ్చినప్పుడు, ఒకరిపై ఒకరు ఇలాంటి తప్పుడు ఆరోపణలు సరికాదని హితవు పలికారు. అయితే ఈ లేఖపై కాంగ్రెస్ స్పందించలేదు. తాజాగా ఇండియా బ్లాక్ సమావేశంలో జరిగిన చర్చను తమకు అనుకూలంగా ఉన్న వ్యాఖ్యలను మాత్రమే కాంగ్రెస్ మీడియాకు లీక్ చేసింది. కేరళ ఎన్నికల వేళ..ఇడి దాడుల సమయంలోనూ, ఇప్పుడు ‘ఇండియా’ సమావేశంలో కాంగ్రెస్ నేతలు వ్యవహారించిన తీరుపై మొత్తంగా వామపక్ష శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మీ ‘కౌగిలింతలు’ ఎవరడిగారు? : జాన్ బ్రిట్టాస్
ఇండియా బ్లాక్ సమావేశంలో పినరయి విజయన్పై రాహుల్ గాంధీ చేసిన ‘కౌగిలింతల’ వ్యాఖ్యలను మీడియాకు కాంగ్రెస్ లీక్ చేసింది. దీనిపై జాన్ బ్రిట్టాస్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘మీ కౌగిలింతలు ఎవరడిగారు?. మోడీని ఆలింగనం చేసుకున్న మీ నుంచి వామపక్షాల నేతలకు ఆ అవసరం లేదు’ అని బ్రిట్టాస్ పేర్కొన్నారు. బిజెపికి అనుకూలమైనరీతిలో కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, ఒంటెద్దు పోకడలు సరికాదని పేర్కొన్నారు. ‘ఇండియా’ సమావేశంలో చర్చించిన అన్ని అంశాలను కాంగ్రెస్ బహిరంగపరిచి ఉంటే బాగుండేదన్నారు. వాస్తవంగా జరిగిన చర్చలో కేవలం 5 శాతం మాత్రమే ఉందని, అందులోను రాహుల్ గాంధీ ముగింపు వ్యాఖ్యలను మాత్రమే కాంగ్రెస్ లీక్ చేసిన వీడియోలో ఉన్నాయని తెలిపారు. అక్కడ అసలు ఏం జరిగిందో ప్రజలు అర్థం చేసుకునేందుకు వీలుగా, మిగిలిన చర్చలను కూడా బహిరంగర్చాలని ఆయన సూచించారు.









కామెంట్లు (0)