- రెండు రోజుల్లో రెండుసార్లు పెంచిన కేంద్రం
- కిలోకు రూపాయి పెంపు - త్వరలో మళ్లీ పెట్రో బాదుడు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఇంధన ధరల పెరుగుదలతో ఇప్పటికే సతమతమవుతున్న ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. వాహనాలకు వినియోగించే సిఎన్జి (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) ధరను మరోసారి పెంచింది. కిలో సిఎన్జిపై ఒక్క రూపాయి ధర పెంచుతూ ఆదివారం నిర్ణయం తీసుకుంది. రెండు, మూడు రోజుల క్రితం పెట్రో, డీజిల్ ధరల పెంపు సందర్భంగా సిఎన్జిపై కూడా కిలోకు రెండు రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి రూపాయి పెంచడంతో సిఎన్జిపై కూడా మూడు రూపాయలు పెంచినట్లయ్యింది. దీంతో వాహనదారులతో పాటు, ఆటో, క్యాబ్ డ్రైవర్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల పెరిగిన ధరాభారాన్ని భరించే విషయంపైనే ఆటో, క్యాబ్ డ్రైవర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. తాజాగా మరో రూపాయి పెరగడంతో వారి పరిస్థితి దారుణంగా మారింది.
దీంతో ఆ భారం మొత్తాన్ని సాధారణ ప్రజలపై మళ్లించే అవకాశం ఉందన్న అభిప్రాయం వినపడుతోంది. దీంతో ప్రజానీకం పెట్రో ధరల పెంపుతో పాటు, సిఎన్జి భారాన్ని కూడా మోయక తప్పని స్థితి ఏర్పడుతోంది. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో సిఎన్జి ధర 80 రూపాయలకు చేరింది. ముంబాయిలో 84 రూపాయలు, హైదరాబాద్లో 100 రూపాయలకు అమ్ముతున్నారు. విజయవాడలో శనివారం కిలో సిఎన్జిని రూ.91.50కు అమ్మగా ఆదివారం రూ. 93కు విక్రయించారు. పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలతో బెంబెలెత్తి ఆటో, క్యాబ్ డ్రైవర్లు పెద్ద సంఖ్యలో సిఎన్జికి మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు సిఎన్జి ధర కూడా సెంచరీకి చేరువ అవుతుండటం గమనార్హం.
త్వరలో పెట్రో బాదుడు తప్పదా...?
ఇటీవలే పెట్రోలు, డీజిల్పై లీటర్కు మూడు రూపాయల ను కేంద్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. ఈ పెంపుదల కేవలం ప్రారంభమేనని, త్వరలో భారీగా పెరిగే అవకాశముందని సమాచారం. మార్కెట్ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ సారి ఏకంగా లీటర్కు పది రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు పెట్రో కంపెనీలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పెంచిన ధరలతో కంపెనీలకు 10 శాతం మాత్రమే నష్టం తగ్గిందని చెబుతునాన్రు. ప్రస్తుతం పెట్రోల్ విక్రయాలపై లీటరుకు రూ.11 నుంచి రూ.20 వరకు, డీజిల్పై రూ.30 నుంచి రూ.39 వరకు నష్టాన్ని భరిస్తున్నట్లు ఆ కంపెనీలు చెబుతున్నాయి. దీని వల్ల రోజుకు వెయ్యికోట్ల రూపాయల వరకు నష్టాన్ని భరించాల్సి వస్తోందని, ఇదే మాదిరి కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలోనే లక్ష కోట్ల రూపాయలకు తమ నష్టం చేరుతుందని పెట్రో కంపెనీలు కేంద్రానికి నివేదించినట్లు సమాచారం.
రూపాయి విలువ తగ్గుతుండటం కూడా నష్టాలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కనీసం 20నుండి 30 శాతం పెంచాలని కంపెనీలు కోరుతున్నాయని సమాచారం. ఇదే విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరదీప్ సింగ్ దృష్టికి కూడా ఆ సంస్థలు తీసుకువెళ్లాయి. ఒకేసారి కాకుండా విడతల వారీగా ధరల పెంపునకు ఆయన అంగీకరించినట్లు సమాచారం. దీంతో రవాణా వ్యయాలు పెరగడంతో కూరగాయలు, నిత్యావసర వస్తువులు, నిర్మాణ సామగ్రి, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు రానున్న రోజుల్లో మరింతగా పెరగనున్నాయి.








కామెంట్లు (0)