బిజినెస్ : దేశీయ మార్కెట్లో బంగారం, వెండిపై కొనుగోలుదారుల ఆసక్తి మళ్లీ పెరుగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు సడలడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, రూపాయి విలువ బలపడడం వంటి పరిణామాలు విలువైన లోహాల ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,55,490కు చేరగా, వెండి ధర కూడా గణనీయంగా పెరిగి కిలోకు రూ.2.57 లక్షల వద్ద నమోదైంది. గత వారం బంగారం ధర ఒక దశలో రూ.1.50 లక్షల కంటే దిగువకు పడిపోయిన సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండికి మళ్లీ డిమాండ్ పెరిగింది. స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 4,323 డాలర్లకు చేరగా, స్పాట్ సిల్వర్ ఔన్సు ధర 70.38 డాలర్లుగా నమోదైంది. గత వారం బంగారం ధర దాదాపు 4,000 డాలర్ల వరకు తగ్గిన తర్వాత తిరిగి పుంజుకుంది.
ఇక కమోడిటీ ఎక్స్ఛేంజ్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.1,53,258 వద్ద, వెండి ఫ్యూచర్స్ ధర రూ.2,52,383 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందం కుదిరినట్లు ప్రకటించడంతో మూడు నెలలకు పైగా కొనసాగిన యుద్ధ పరిస్థితులకు ముగింపు దశ చేరుకున్నట్లు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ చమురు మార్కెట్లో ధరలు తగ్గి, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 83 డాలర్లకు పడిపోయింది. అదే సమయంలో భారత రూపాయి కూడా బలపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 53 పైసలు పెరిగి 93.65 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక పరిణామాలు బంగారం, వెండి మార్కెట్లలో కొత్త కదలికలకు దారితీశాయి.








కామెంట్లు (0)