బెంగళూరు : రాజకీయ ప్రముఖులు, విఐపి లు వస్తున్నారంటే చాలు అరగంట ముందే… ట్రాఫిక్ బంద్ ..! భద్రతా కారణాల రీత్యా ట్రాఫిక్ ను ఆపుతారు.. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోతాయి..! మరి ఆ సమయంలో ఆంబులెన్స్ లైనా కూత పెడుతూ పడిగాపులు కాస్తుంటాయి.. డెలివరీకి, అత్యవసర చికిత్సలకు వెళ్లే సామాన్య ప్రజల పరిస్థితేంటి ? ఇలాంటి పరిస్థితే బెంగళూరులో చోటుచేసుకుంది. కర్నాటక గవర్నర్ కాన్వాయ్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు వైపు వెళుతుండటంతో పోలీసులు ఆ మార్గంలో దాదాపు 30 నిమిషాలపాటు ట్రాఫిక్ను నిలిపేశారు. దీంతో ఓ వ్యక్తి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. గర్భవతిగా ఉన్న తన భార్యను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువెళుతుండగా, అరగంటపాటు ట్రాఫిక్ ను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గవర్నర్ కాన్వాయ్ వచ్చే రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగాడు. అండర్పాస్ నిర్మాణ పనుల కారణంగా ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు మార్గం ఇప్పటికే రద్దీగా ఉందని, ఈ విధంగా గంటల తరబడి ట్రాఫిక్ను నిలిపివేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి ? అని ఆ వ్యక్తి పోలీసులను నిలదీశారు. తన భార్య గర్భవతి అని.. అత్యవసర వైద్య పరిస్థితి కంటే విఐపి కాన్వాయ్ లకే ప్రాధాన్యమిస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ క్లియర్ చేసే వరకు రోడ్డుపై నుంచి కదలనని చెప్పడంతో పోలీసులు ఓ వైపు నుంచి వాహనాలను క్లియర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో విఐపి కల్చర్పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ‘వీఐపీల సౌకర్యాలకు ఇచ్చే విలువ ప్రజల ప్రాణాలకు లేకుండా పోతోంది’ అంటూ మండిపడుతున్నారు.
నా భార్య గర్భవతి.. అత్యవసర చికిత్స కంటే విఐపి కాన్వాయే ప్రాధాన్యమా ?
01 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 01, 2026, 01:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)