హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న అమర్నాథ్కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నియామకం చెల్లదంటూ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. అమర్నాథ్ను వెంటనే ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించాలని హెచ్సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డిని ధర్మాసనం ఆదేశించింది. అంతేకాకుండా, వెంటనే స్పెషల్ ఏజీఎం నిర్వహించి, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే..?
ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైర్డ్ చీఫ్ జస్టిస్, ప్రస్తుత అంబుడ్స్మన్ సురేష్ కుమార్ కైత్ గత ఫిబ్రవరిలో అమర్నాథ్ను హెచ్సీఏ నూతన అధ్యక్షుడిగా ప్రకటించారు. 2023లో జరిగిన హెచ్సీఏ ఎన్నికల్లో జగన్ మోహన్ రావు చేతిలో అమర్నాథ్ కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయి రెండో స్థానంలో నిలిచారు. ఎన్నికల్లో గెలిచిన జగన్ మోహన్ రావుపై అవినీతి ఆరోపణలు రావడం, ఆయన అరెస్ట్ కావడంతో ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించారు. దాంతో రెండో స్థానంలో నిలిచిన అమర్నాథ్కు ఆ బాధ్యతలను అప్పగించారు. రన్నరప్గా ఉన్న అమర్నాథ్ను అధ్యక్షుడిగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని భావించిన హైకోర్టు, ఇప్పుడు ఆ ఎంపికను రద్దు చేసింది. కోర్టు తాజా తీర్పుతో హెచ్సీఏ ప్రెసిడెంట్ పదవికి మరోసారి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రికెట్ వర్గాల్లో ఈ తీర్పు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.








కామెంట్లు (0)