సెమీఫైనల్లో ఓటమి
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, జులనా ఎమ్మెల్యే వినేశ్ ఫొగాట్కు ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుదీర్ఘ విరామం తర్వాత కోర్టు ఆదేశాలతో బరిలోకి దిగిన ఆమె, శనివారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మహిళల 53 కేజీల విభాగం సెమీఫైనల్లో పరాజయం పాలయ్యారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఆసియా రజత పతక విజేత మీనాక్షి గోయట్ చేతిలో 4-6 తేడాతో వినేశ్ ఓడిపోయారు. దీంతో ఈ ఏడాది జపాన్లో జరగనున్న ఆసియా క్రీడలకు అర్హత సాధించే అవకాశాన్ని ఆమె కోల్పోయారు.
కోర్టు వివాదాలను పక్కనబెట్టి మ్యాట్పైకి వచ్చిన వినేశ్ పాత ఫామ్ను ప్రదర్శించారు. తొలి బౌట్లో జ్యోతిని 7-1 తేడాతో చిత్తు చేసి శుభారంభం చేశారు. ఆ తర్వాతి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో నిషుపై 7-6 తో హోరాహోరీగా పోరాడి విజయం సాధించారు. కానీ, ఫైనల్ చేరే క్రమంలో మీనాక్షితో జరిగిన సెమీస్లో మాత్రం తృటిలో విజయాన్ని చేజార్చుకున్నారు.
“నేను ఓడిపోలేదు, వ్యవస్థపై పోరాడాను”
ఈ పరాజయంపై వినేశ్ ఫొగాట్ భావోద్వేగానికి లోనయ్యారు. “నేను మ్యాట్పై ఓడిపోలేదు. ఒకవైపు పూర్తి వ్యవస్థ ఉంది, మరోవైపు నేను ఒంటరిగా ఉన్నాను. ప్రతి పాయింట్ కోసం నేను పోరాడాల్సి వచ్చింది” అని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ, తాను నిరాశపడనని, త్వరలోనే మరింత బలంగా మ్యాట్పైకి తిరిగి వస్తానని (“మై వాపస్ ఆవూంగీ”) ఆమె స్పష్టం చేశారు.









కామెంట్లు (0)