వాషింగ్టన్ : ఆకాశంలో నేడు అరుదైన, అత్యంత ఆకర్షణీయమైన ఖగోళ వింత ఆవిష్కృతం కానుంది. ఒకే రోజున అటు ‘బ్లూ మూన్’గా, ఇటు ‘మైక్రో మూన్’గా చంద్రుడు కనిపించనున్నాడు. ఈ రెండు విభిన్న ఖగోళ విశేషాలు ఒకేసారి కలిసి రావడం దశాబ్దాలకు ఒకసారి మాత్రమే జరిగే అరుదైన విషయమని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’`(ఎన్ఎఎస్ఎ) వెల్లడించింది. ఈ అద్భుత దృశ్యం భారతదేశంలోనూ స్పష్టంగా కనిపించనుందని తెలిపింది.
సాధారణంగా ఒకే క్యాలెండర్ నెలలో రెండు పౌర్ణమిలు వస్తే, అందులో రెండో పౌర్ణమి నాటి చంద్రుడిని ‘బ్లూ మూన్’ అని పిలుస్తారు. క్యాలెండర్ ప్రకారం ఇది ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మే 1వ తేదీన మొదటి పౌర్ణమి రాగా, నేడు (మే 31) రెండో పౌర్ణమి రావడంతో దీనికి బ్లూ మూన్ అని పేరొచ్చింది. అయితే, ‘బ్లూమూన్ ‘ ఉన్నంత మాత్రాన చంద్రుడు నీలం రంగులోకి మారిపోడు. ఎప్పటిలాగే తెల్లగా, ప్రకాశవంతంగానే కనిపించనుంది. ఈ బ్లూ మూన్కు ‘మైక్రో మూన్’ విశేషం కూడా తోడవ్వడమే నేటి ప్రత్యేకత. చంద్రుడు భూమి చుట్టూ తిరిగే క్రమంలో భూమికి అత్యంత దూరంలో ఉండే బిందువు (అపోజీ) వద్దకు వచ్చినప్పుడు పౌర్ణమి సంభవిస్తే దానిని మైక్రోమూన్ అంటారు. దీనివల్ల చంద్రుడు సాధారణ పౌర్ణమి నాటి పరిమాణం కంటే దాదాపు 14 శాతం చిన్నదిగా, 30 శాతం తక్కువ కాంతితో కనిపిస్తాడు.
భారతదేశంలో నేడు (మే 31) సాయంత్రం వేళల్లో ఈ అరుదైన మైక్రో బ్లూ మూన్ను ప్రజలు వీక్షించవచ్చు. అయితే, కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావం వల్ల ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటే మాత్రం ఆటంకం కలగవచ్చు. దశాబ్దాల తర్వాత వస్తున్న ఈ ఖగోళ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు శాస్త్రవేత్తలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.









కామెంట్లు (0)