ప్రజాశక్తి హైదరాబాద్ బ్యూరో : మద్యం కుంభకోణం కేసులో ఎపి బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డిను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారించింది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ బషీర్బాగ్లో ఉన్న ఇడి కార్యాలయానికి బుధవారం పలు డాక్యుమెంట్లతో వచ్చిన వాసుదేవరెడ్డిని అధికారులు ఐదు గంటలకు పైగా ప్రశ్నించారు. ఆయన బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్న సమయంలో ఆయన కుటుంబ సభ్యుల పేరిట కొనుగోలు చేసిన సుమారు రూ.80 కోట్ల ఆస్తుల వ్యవహారంపైనే ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలిసింది. కాగా, తమ కుటుంబ సభ్యుల ఆస్తుల కొనుగోలు విషయంతో తనకు ఎటువంటి సంబంధంలేదని వాసుదేవరెడ్డి ఇడి అధికారులకు చెప్పినట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే రూ.462 కోట్ల ఆస్తులను ఇడి జప్తు చేసింది. వైసిపికి చెందిన మద్యం వ్యాపారులతో కలిసి కుట్రకు రూపకల్పన, అమలులో ఆయన ప్రధాన పాత్ర పోషించారని ఇప్పటికే సిట్ తన విచారణలో నిర్ధారించింది. 2019 కంటే ముందువరకూ ఆటోమేటెడ్ విధానంలో ఉన్న మద్యం సరఫరా ఆర్డర్ల జారీ వ్యవస్థను నిలిపివేసి, ఆ స్థానంలో మాన్యువల్ విధానాన్ని ప్రవేశపెట్టటం ద్వారా కుంభకోణానికి దారులు తెరిచారని సిట్ పేర్కొంది. ఈ కేసులో పెద్దఎత్తున నిధులు చేతులు మారాయని సిట్ గుర్తించడంతో ఇడి రంగంలోకి దిగింది. వాసుదేవరెడ్డిని మరోసారి ఇడి విచారణకు పిలిచే అవకాశం ఉంది.
Print Editionఇడి విచారణకు హాజరైన వాసుదేవరెడ్డి
27 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 27, 2026, 11:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)