తెలంగాణ : భారత రాష్ట్ర సమితి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ భవన్లో బాల్క సుమన్ ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులతో బిఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు గో బ్యాక్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆ తర్వాత పోలీసులతో బిఆర్ఎస్ న్యాయవాదులు మాట్లాడారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్పై నాంపల్లి పిఎస్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైందని, ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని అబిడ్స్ ఎసిపి తెలిపారు. పోలీసులు భారీగా మోహరించడంతో కొంత సేపటి తర్వాత బాల్కా సుమన్ తెలంగాణ భవన్ నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన తర్వాత అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
కాంగ్రెస్ పాలకులు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నారు : బాల్క సుమన్
‘‘తెలంగాణ ఉద్యమంలోనూ నన్ను టార్గెట్ చేశారు. ఉద్యమ సమయంలో నాపై 250కి పైగా కేసులు పెట్టి.. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇటీవల క్యాతనపల్లి ఎన్నిక సమయంలోనూ నన్ను జైల్లో పెట్టారు. అయినా, సరే ప్రజాప్రతినిధిగా ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నా. మరోసారి నన్ను జైలుకు పంపాలని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి వివేక్ నిర్ణయించారు. నన్ను జైల్లో పెట్టి పైశాచికానందం పొందాలని పాలకులు భావిస్తున్నారు. నాపై దృష్టి పెట్టే ముందు ప్రజల సమస్యలపై దృష్టి సారించాలి. సింగరేణిలో వందల కోట్ల విలువైన స్కాములు జరుగుతున్నాయి. సింగరేణి కుంభకోణాలమయంగా మారిపోయింది. కాంగ్రెస్ పాలకులు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నారు. చట్టంపై, వ్యవస్థలపై, రాజ్యాంగంపై నమ్మకం ఉంది. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులకు సహకరిస్తా. నేను ఎక్కడికీ పారిపోలేదు.. పార్టీ కార్యక్రమంలో ఉన్నా. ప్రశ్నించే నేతలను వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది’’ అని బాల్క సుమన్ ఆరోపించారు.








కామెంట్లు (0)