తెలంగాణ డిజిపికి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ వినతి
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : గత కొన్ని రోజులుగా ఆన్లైన్లో తనకు రకరకాల బెదిరింపులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ తెలంగాణ డిజిపి సివి ఆనంద్ను కోరారు. మంగళవారం ఆయన ఐలు నాయకులతో కలిసి హైదరాబాద్లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డిజిపిని కలిశారు. ఆన్లైన్ ద్వారా తనకు వచ్చిన బెదిరింపుల మెసేజ్లను అందజేసి పరిశీలిం చాల్సిందిగా కోరుతూ డిజిపికి వినతిపత్రం అందజేశారు. డిజిపి స్పందిస్తూ, తగిన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం డిజిపి కార్యాలయం వెలుపల మీడియాతో కె నాగేశ్వర్ మాట్లాడుతూ ఆన్లైన్లో తనకు వచ్చిన బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని డిజిపిని కోరినట్లు తెలిపారు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించి గతంలో తాను చేసిన కామెంట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించానని, దాన్ని జనసేన పార్టీ కూడా ఆహ్వానించి… ఇంతటితో ఆ వ్యవహారాన్ని వదిలేయాలని, అది ముగిసిన అధ్యాయమని ఆ పార్టీ తమ కేడర్కు కూడా విజ్ఞప్తి చేసిందని నాగేశ్వర్ గుర్తుచేశారు. వ్యాఖ్యలను ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని విలేకరులు ప్రశ్నించగా, ఉపసంహరించుకున్న వ్యాఖ్యలపై మాట్లాడనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి తనకు ఇప్పటివరకు ఎటువంటి నోటీసూ అందలేదని, తమ ఇంటికి ఎపి పోలీసులు కూడా రాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా నాగేశ్వర్ వివరణ ఇచ్చారు.








కామెంట్లు (0)