విజయవాడ : జూన్ 6 న (రేపు) కాకినాడ జిల్లాలోని కె.జి.బేసిన్ గ్యాస్ ప్రాంతాల్లో వామపక్ష పార్టీల నాయకులు పర్యటించనున్నారు. దీనికి సంబంధించి వామపక్ష పార్టీల తరపున శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. చమురు, గ్యాస్ ధరలు పెరిగి, మార్కెట్లో కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో …. 12వ ఫైనాన్స్ సిఫార్సు ప్రకారం కెజి బేసిన్లో ఉత్పత్తి అయ్యే గ్యాస్లో రాష్ట్రానికి 50% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 10 వామపక్ష పార్టీలు కెజిబేసిన్ గ్యాస్ ప్రాంతాల్లో (కాకినాడ జిల్లా) ఈనెల (జూన్) 6వ తేదీన పర్యటిస్తున్నాయని ప్రకటించారు. ఈ పర్యటనలో సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎ.వి.నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మధు, సిపిఐ(యంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పి.ప్రసాద్, జిల్లా నాయకులు దుర్గాప్రసాద్, సిపిఐ(యంఎల్) రాష్ట్ర నాయకులు జాస్తి కిషోర్బాబు, సిపిఐ(యంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు రామకృష్ణ, ఆలిండియా ఫార్వర్డ్బ్లాక్ నాయకులు ఎ.సూర్యనారాయణ, జె.పాండవులు, ఇతర వామపక్ష పార్టీల నాయకులు పాల్గొననున్నారని తెలిపారు. కృష్ణా గోదావరి డి 6 బేసిన్లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును రిలయన్స్ కంపెనీ ఇక్కడ నుండి మహారాష్ట్ర, గుజరాత్లకు తరలించి వేలకోట్ల రూపాయలు గాలివాటంగా సంపాదిస్తున్నదని తెలిపారు. ఆయిల్ డ్రిల్లింగ్, ఇతర కార్యకలాపాల వలన నిత్య కాలుష్యమే కాక బ్లో అవుట్లు, ఇతర ప్రమాదాల్లో రాష్ట్రం విలువైన ప్రాణాలను కోల్పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తుల్లో 50 % రాష్ట్రానికివ్వాలని 12వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసినప్పటికీ అమలు కాలేదని, మరోవైపు రాష్ట్రంలో గ్యాస్ దొరకక సాధారణ ప్రజలు, చిరు వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అనేక వ్యాపారాలు మూతపడి వందలాదిమంది ఉపాధిని కోల్పోయి వీధుల్లో పడ్డారని వివరించారు. నిత్యావసరాలు, తినుబండారాల ధరలు పెరిగాయనీ, అందువలన కె.జి.బేసిన్లో ఉత్పత్తి అయ్యే గ్యాస్లో 50 % రాష్ట్రానికివ్వాలని కోరారు. చట్టబద్దంగా రావాల్సిన చమురు, గ్యాస్ వాటా పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.









కామెంట్లు (0)