చెన్నై: టీమిండియా క్రికెటర్ విజయ్ శంకర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)తో పాటు దేశవాళీ క్రికెట్కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించాడు. శుక్రవారం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. 'ఐపిఎల్తో పాటు దేశవాళీ క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా... కొత్త అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు, మరింత క్రికెట్ ఆడేందుకు ఈ రెండింటికి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా.. బిసిసిఐ, సహకరించిన ప్రతి ఒక్క ఆటగానికి ధన్యవాదాలు. ఎన్నో విషయాలు నేర్చుకోవడం, లెక్కలేనన్ని జ్ఞాపకాలు పోగేసుకోడవడంతో పాటు దేశం తరఫున ఆడడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. 2019 వన్డే ప్రపంచకప్లో చివరి ఓవర్ వేసి తొలి బంతికే వికెట్ తీయడం జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. నా కెరీర్లలో నేను విద్వేషాన్ని, ప్రతికూల పరిస్థితులను చవిచూశాను. అయితే.. వాటిని నేను పట్టించుకోకుండా ముందుకు సాగాను. నేను అలా చేయగలిగినప్పుడు ఎవరికైనా సాధ్యమే. పాజిటివ్గా ఆలోచించండి. బాగా కష్టపడండి. క్రికెట్టే నా జీవితం’ అని భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టాడు.
2013లో అరంగేట్రం
తమిళనాడుకు చెందిన విజయ్ 2012లో రాష్ట్ర జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. పదమూడేళ్లు సొంత జట్టుకు ఆడిన విజయ్ శంకర్.. 2025-26 సీజన్లో త్రిపురకు మారాడు. 2013లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడిగా ఐపీఎల్ అరంగేట్రం చేసి 2017లో సన్రైజర్స్కు.. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీతో.. ఆపై మూడేళ్లు మళ్లీ సన్రైజర్స్ తరఫున బరిలోకి దిగాడు. 2022లో గుజరాత్ టైటాన్స్ అరంగేట్రంలోనే ఛాంపియన్గా నిలవడంలో విజయ్ కీలక పాత్ర పోషించాడు. టీమిండియా ఆటగాడిగా 2018-19 మధ్య కాలంలో 12 వన్డేలు, తొమ్మిది టీ20లు ఆడాడంతే. 2025లో చెన్నై గూటికి చేరిన విజయ్ ను 2026 ఐపిఎల్ మినీ వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.








కామెంట్లు (0)