పట్టాలపైకి దూకిన ప్రయాణికులు
మరో రైలు ఢీకొని నలుగురి మృతి
మోరెనా : మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రైలులో మంటలు చెలరేగాయన్న పుకారుతో భయాందోళనకు గురైన ప్రయాణికులు పట్టాలపైకి దూకగా, ఎదురుగా వస్తున్న మరో రైలు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరితో సహా మొత్తం నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.
అసలేం జరిగింది?
ఉత్తర మధ్య రైల్వే అధికారుల సమాచారం ప్రకారం.. ఖజురహో-ఉదయ్పూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ (రైలు నెం. 19665) ఆదివారం సాయంత్రం 4:15 గంటల సమయంలో ఝాన్సీ డివిజన్లోని హేతంపూర్ - ధోల్పూర్ స్టేషన్ల మధ్య నిలిచిపోయింది. ఎవరో ప్రయాణికుడు జనరల్ కోచ్లో చైన్ లాగడంతో రైలు ఆగింది. అదే సమయంలో రైలులో మంటలు చెలరేగాయని ఎవరో కేకలు వేయడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో చాలామంది రైలు దిగి పక్కనే ఉన్న మరో పట్టాపైకి పరుగులు తీశారు. అయితే, అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఫిరోజ్పూర్-సియోనీ పాతాళ్కోట్ ఎక్స్ప్రెస్ (రైలు నెం. 20424) పట్టాలపై ఉన్న ప్రయాణికులను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆఫ్రీన్ (35), అసద్ (4). శకుంతల (60) వీర్మా దేవి (60)లు మృతి చెందారని అధికారులు తెలిపారు.
ఒక మహిళా ప్రయాణికురాలు మీడియాకు వివరిస్తూ.. "ఎవరో చైన్ లాగారు, వెంటనే 'మంటలు.. మంటలు' అని కేకలు వినిపించాయి. దీంతో అందరం కంగారుగా రైలు దిగి పక్క పట్టాలపైకి వెళ్లాం. అప్పుడే పాతాళ్కోట్ ఎక్స్ప్రెస్ దూసుకొచ్చి ప్రయాణికులను ఢీకొట్టింది. ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఈ గందరగోళంలో చిక్కుకున్నారు" అని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పిఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీస్ (జిఆర్పి), స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.








కామెంట్లు (0)