సరైన పత్రాలు లేవంటూ అదుపులోకి తీసుకున్న పోలీసులు
తరలించేందుకు ఏర్పాట్లు
వాషింగ్టన్ : అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు మంగళవారం ‘ఆపరేషన్ చెక్మేట్’ పేరుతో భారీ తనిఖీలు నిర్వహించారు. ఇందులో సరైన పత్రాలు లేవంటూ 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుల వివరాలను యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సిబిపి) సోమవారం వెల్లడించింది. ‘ఆపరేషన్ చెక్మేట్’లో భాగంగా అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న 52 మందిని అరెస్టు చేశామని, వారిలో 30 మంది భారతదేశానికి చెందినవారని సిబిపి తెలిపింది. వారిలో మిగిలిన ఆరుగురు మెక్సికో, ఎల్ సాల్వడార్, రష్యాకు చెందినవారని పేర్కొంది. ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించారనే నెపంతో వారిని భారత్కు పంపించే అవకాశం ఉందని పలువురు ప్రవాస భారతీయులు తెలిపారు.
భారతీయులే లక్ష్యంగా దాడులు..
ఇటీవల వలసలపై అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహిరిస్తుంది. గతంలో భారతీయులను చేతులకు, కాళ్లకు సంకెళ్లను వేసి పంపేసిన సంగతి తెలిసిందే. చట్టబద్ధమైన అనుమతులు లేవంటూ పనిచేస్తున్న విదేశీయులను, ప్రత్యేకంగా భారతీయులే లక్ష్యంగా చర్యలు తీసుకునేందుకు ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ‘ఆపరేషన్ చెక్మేట్’ కూడా అదే చర్యల్లో భాగంగా చేపట్టిన కార్యక్రమంగా పలువురు భావిస్తున్నారు. అయితే ఈ ఘటన అమెరికాలో నివసిస్తున్న భారతీయ వలసదారులను కలవర పరుస్తుంది. ముఖ్యంగా ట్రక్కింగ్, రవాణా రంగాల్లో పనిచేస్తున్న వారు తమ పత్రాలు, వీసా నిబంధనలపై మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. అరెస్టయిన భారతీయుల పరిస్థితి, బహిష్కరణ ప్రక్రియపై భారత రాయబార కార్యాలయం కూడా నిఘా ఉంచినట్లు సమాచారం.








కామెంట్లు (0)