కొలంబో: సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాజకీయ ప్రేరేపితంగా జరిపిన దాడిని శ్రీలంక కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. మితవాద శక్తుల రాజకీయ కక్ష సాధింపును ఎదుర్కొంటున్న పినరయి విజయన్, సీపీఐ(ఎం) మరియు కేరళలోని కార్మిక, రైతాంగ ప్రజలకు శ్రీలంక కమ్యూనిస్టు పార్టీ సంఘీభావం తెలిపింది. ఈ విషయమై పార్టీ అంతర్జాతీయ విభాగం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
పినరాయి విజయన్ కేరళలోని కార్మికులు, రైతులు, అణగారిన వర్గాల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న ప్రజానాయకుడని ఆ ప్రకటన పేర్కొంది. కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వాలు ప్రజా ప్రత్యామ్నాయం సాధ్యమేనని ప్రపంచానికి నిరూపించాయి. మితవాద శక్తులు ఈ ప్రజా ప్రత్యామ్నాయాన్ని అసహనంతో చూస్తున్నాయి. కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించి చేస్తున్న ఈ వేట దానికి ప్రతిబింబమే.
కేంద్ర సంస్థలను ఉపయోగించి చేసే ఇటువంటి వేధింపుల ద్వారా వామపక్షాల గొంతు నొక్కలేరని శ్రీలంక కమ్యూనిస్టు పార్టీ స్పష్టం చేసింది. సంక్షోభాలను అధిగమించడం ద్వారా కేరళలో ఎర్ర జెండా మరింత ఎత్తుకు ఎగురుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.








కామెంట్లు (0)