పర్యావరణం అన్నా, భూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్నా ఏ మాత్రమూ ఖాతరు చేయని బడా దేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. అలా తమ కార్పొరేట్ లాభాల కోసం మానవజాతిని వినాశనం అంచుల్లోకి నెట్టేందుకు సంకోచించని ప్రభుత్వాల్లో అమెరికా ముందుంటుంది. తలసరి లెక్కలు తీస్తే భారతీయ పౌరుడి కన్నా, అమెరికన్ పౌరుడు దాదాపు 30 రెట్లు ఎక్కువగా కర్బన ఉద్గారాల విడుదలకు, భూతల ఉష్ణోగ్రతల పెంపుకు కారకుడౌతున్నాడు. అయితే అమెరికన్ ప్రభుత్వానికి పట్టకపోయినా, భూతల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయన్న ఆందోళన సగటు అమెరికన్ పౌరుల్లో ఎక్కువగా ఉంది. ఈ మధ్య అమెరికాలోని సియాటిల్ నగరంలో ఉంటున్న ఒక మిత్రుడు తన మనుమరాలు రాసిన రచనను పంపారు.
ఆ బాలిక రచనను తెలుగులో ఇస్తున్నాం ..:
‘ఈ మధ్య కాలంలో కార్చిచ్చులు ఎక్కడబడితే అక్కడ సంభవిస్తున్నాయి. వాటివల్ల భూమి మీద వేడి బాగా పెరిగిపోతోంది.
‘మరి దానిని అరికట్టవచ్చా?’ అంటే తప్పకుండా చేయగలం!
దానికి నేనో మార్గం చెబుతాను.
రోడ్లమీద ఎక్కువ సైకిల్ మార్గాలను నిర్మిస్తే అప్పుడు ఎక్కువ మంది సైకిళ్ళను వాడడానికి వీలౌతుంది. కార్లు చమురు ఇంధనాన్ని చాలా ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి. అదే సైకిళ్ళయితే ఎటువంటి ఇంధనమూ అవసరం లేదు కదా! ఈ చమురు ఇంధనాన్ని మరీ ఎక్కువగా వాడేస్తున్నాం గనుకనే భూమి మీద వేడి పెరిగిపోతోంది. దానివల్ల కార్చిచ్చులు పదే పదే వస్తున్నాయి.
సైకిళ్ళ కోసం ఎక్కువ దారులు ఏర్పాటు చేస్తే మనుషులు ఎక్కువమంది సైకిళ్ళను వాడేందుకు మొగ్గు చూపుతారు. వాళ్ళకు వ్యాయామం ఎక్కువ లభిస్తుంది. ‘తమ స్వంత శక్తితోటే ప్రయాణం చేయగలుగుతున్నాం’ అని తెలుసుకోడం వలన వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దానితోబాటు వాళ్ళ శారీరిక బలం, ఆరోగ్యం కూడా మెరుగుపడతాయి.
పైగా సైకిళ్ళ దారులు ప్రతి ఒక్కరికీ క్షేమదాయకం కూడా! కార్లకింద పడిపోయే ప్రమాదం తగ్గిపోతుంది. ఆ కార్లకు వేరే దారులు ఎటూ ఉండనే వున్నాయి. అంతేకాదు, ఇదంతా చేయడాన్ని మన చట్టాలు ఆమోదిస్తున్నాయి కూడా!
నా ఈ అభిప్రాయాన్ని మీరు గమనించినందుకు ధన్యవాదాలు.

మీ పౌరురాలు,
– నికిత వెంపరాల,
2వ తరగతి, సియాటిల్.








కామెంట్లు (0)