ప్రజాశక్తి -బైరెడ్డిపల్లి : కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం బైరెడ్డిపల్లి మండల కేంద్రంలోని చెక్పోస్ట్ నాలుగు రోడ్ల కూడలిలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త ఎన్. వెంకటే గౌడ సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మొగసాల కృష్ణమూర్తి, బైరెడ్డిపల్లి మండల ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దయానంద గౌడు, మండల కన్వీనర్ శ్రీ ఆర్. కేశవులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండలంలోని బైరెడ్డిపల్లి, పాతూరు, గడ్డూరు, చప్పడిపల్లి, జంగాల అగ్రహారం, దాసర్లపల్లి, కడపనతం, పాతపేట తదితర గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సహాయం, రైతులకు మద్దతు, సంక్షేమ పథకాల కొనసాగింపు తదితర అంశాలపై ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ధరల పెరుగుదల, ఉపాధి అవకాశాల కొరత, రైతుల ఇబ్బందులు మరింత పెరిగాయని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడమే ఈ ధర్నా ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వం కొనసాగిస్తే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
ప్రభుత్వ హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం : వైసీపీ
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 04, 2026, 03:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)