మంగళవారం ఒక్కరోజే 11 లక్షల కోట్ల సంపద ఆవిరి
ఇన్వెస్టర్ల లబోదిబో… తగ్గిన విశ్వాసం
ఆర్థిక వ్యవస్థపైనా భయాలు
ముంబయి : ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన పొదుపు సూచనలతో పాటు పలు అంతర్జాతీయ పరిణామాలతో మార్కెట్లు అతలాకు తలామవుతున్నాయి. మంగళవారం ఉదయం నష్టాలలో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే సాగింది. దీంతో సాయంత్రానికి దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయల సంపద మార్కెట్ల నుండి ఆవిరైంది. దీంతో ముదుపర్లు లబోదిబోమంటున్నారు. బంగారం కొనుగోళ్లు నిలిపివేయడంతో పాటు,పెట్రోల్, డీజిల్ వినియో గంపై ప్రధాని చేసిన సూచనలతో భారత స్టాక్ మార్కెట్లపై దేశ, విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం సన్నగిల్లిందన్న వ్యాఖ్యలు ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు, కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్తో రూపాయి రికార్డ్ పతనం తదితర పరిణామాలతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఫలితంగా మంగళ వారం ఒక్క రోజే ముదుపర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. మంగళవారం ట్రేడింగ్లో బిఎస్ఇ సెన్సెక్స్ 1,456 పాయింట్లు లేదా 1.92 శాతం పతనమై 74,559కు పరిమితమయ్యింది. నాలుగు రోజుల్లో సెన్సెక్స్ మొత్తం 3,399.28 పాయింట్లు లేదా 4.36 శాతం నష్టపోయింది. దీనివల్ల బిఎస్ఇలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 456లక్షల కోట్లకు పడిపోయింది. గడిచిన 4 రోజుల్లోనూ మార్కెట్లు నష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఫలితంగా నాలుగురోజుల్లో 16.77 లక్షల కోట్లు హరించుకుపోయినట్లు అంచనా!
రంగాల వారీగా..
మంగళవారం బిఎస్ఇలో 3,412 షేర్లు నష్టపోగా, కేవలం 869 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. సెన్సెక్స్30లో టెక్మహీంద్రా, అదానీ పోర్ట్స్, హెచ్సిఎల్ టెక్, టిసిఎస్, టైటాన్, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి దిగ్గజ సంస్థలు భారీగా నష్టపోయాయి. అయితే ఎస్బిఐ మాత్రం లాభాల్లో ముగిసి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. రంగాల వారీగా రియాల్టీ 4.22 శాతం, ఐటి 3.37 శాతం, కన్య్సూమర్ డ్యూరెబుల్స్ 3.35 శాతం చొప్పున పతనమై మార్కెట్లను తీవ్ర ఒత్తిడికి గురి చేశాయి.








కామెంట్లు (0)