ముంబయి : దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం బలమైన రికవరీ నమోదు చేశాయి. వరుస నష్టాల తర్వాత కొనుగోళ్లు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ సెన్సెక్స్ 789 పాయింట్లు ఎగిసి 75,398.72 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 277 పాయింట్లు పెరిగి 24,689.60 స్థాయికి చేరుకుంది.
ఉదయం 74,947 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ట్రేడింగ్ సమయంలో 75,681 గరిష్ట స్థాయిని తాకింది. అనంతరం స్వల్ప మార్పులతో చివరకు 75,398 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ 30 షేర్ల సూచీలో భారతి ఎయిర్టెల్, ఎచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఎటర్నల్ కంపెనీల షేర్లు గణనీయంగా పెరిగాయి. మరోవైపు మారుతి, యాక్సిస్ బ్యాంక్, హిందుస్తాన్ యునీలీవర్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో భారత మార్కెట్లు నాలుగు శాతానికి పైగా పడిపోయిన నేపథ్యంలో గురువారం పెట్టుబడిదారులు మళ్లీ కొనుగోళ్లకు మొగ్గుచూపారు. అంతర్జాతీయ మార్కెట్లలో జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పి, హాంకాంగ్ హాంగ్సెంగ్ సూచీలు కూడా లాభాల్లో కొనసాగడం దేశీయ మార్కెట్లకు మద్దతు ఇచ్చింది.
బలహీనపడిన రూపాయి ....
అయితే మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పటికీ రూపాయి మాత్రం బలహీనపడింది. డాలర్తో రూపాయి విలువ 95.73 వద్ద ట్రేడైంది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కూడా పెరుగుతున్నాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 0.50 డాలర్లు పెరిగి 106.16 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇటీవల చమురు వినియోగంపై ప్రధాని Narendra Modi చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇంధన ధరల ప్రభావం మార్కెట్లపై చర్చనీయాంశమైంది.








కామెంట్లు (0)