దశాబ్దపు కనిష్టానికి విక్రయాలు
అధిక ధరల ఎఫెక్ట్
ఈ ఏడాది విక్రయాలు 15 శాతం తగ్గొచ్చు
క్రిసిల్ రిపోర్ట్
న్యూఢిల్లీ : భారీగా పెరిగిన బంగారం ధరలు అభరణాల అమ్మకాలను అమాంతం పడేస్తున్నాయి. హెచ్చు ధరలకు తోడు రూపాయి విలువ క్షీణత, కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని 6 శాతం నుండి ఏకంగా 15 శాతానికి పెంచడం వల్ల దేశంలో బంగారు ఆభరణాల కొనుగోళ్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో దేశీయంగా ఆభరణాల అమ్మకాల పరిమాణం 13-15 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక పేర్కొంది. దీనివల్ల మొత్తం అమ్మకాలు 620-640 టన్నులకు పరిమితం కానున్నాయని అంచనా వేసింది. కరోనా ప్రభావిత 2021 ఆర్థిక సంవత్సరాన్ని మినహాయిస్తే, గత పదేళ్లలో పసిడి ఆభరణాల విక్రయాల్లో ఇదే అత్యల్ప దశాబ్దపు కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,60,000 మార్కుకు చేరడం వల్ల సామాన్యుల కొనుగోలు శక్తి హరించుకుపోయింది. దీనివల్ల వినియోగదారులు భారీ ఆభరణాల కంటే 16-22 క్యారెట్ల పరిధిలో ఉండే తక్కువ బరువు గల లైట్వెయిట్, రత్నాలు పొదిగిన జ్యువెలరీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే.. ఆభరణాల రూపంలో డిమాండ్ తగ్గినప్పటికీ, సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడి బిస్కెట్ల, నాణేల అమ్మకాలు గత రెండేళ్లలో 50 శాతానికి పైగా పెరిగాయి. దేశీయంగా బంగారం కొనుగోళ్లను తగ్గించి, విదేశీ కరెన్సీ వెలుపలికి పోకుండా అడ్డుకోవడం ద్వారా వాణిజ్య లోటును తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సుంకాల పెంపు నిర్ణయం తీసుకుంది. అమ్మకాల పరిమాణం గణనీయంగా తగ్గినప్పటికీ, బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరగడం వల్ల జ్యువెలరీ రంగం రాబడి మాత్రం 20-25 శాతం వృద్ధిని నమోదు చేయనుంని క్రిసిల్ పేర్కొంది. సరుకు నిల్వ ఖర్చులు, బ్యాంక్ అప్పులు పెరిగినప్పటికీ, మెరుగైన లాభాల కారణంగా ఆర్గనైజ్డ్ రిటైలర్ల ఆర్థిక స్థిరత్వం పటిష్టంగానే ఉంటాయని క్రిసిల్ విశ్లేషించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద రిటైల్ సంస్థలు రిస్క్ తగ్గించుకోవడానికి ఫ్రాంచైజ్ నమూనా ద్వారా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు జాగ్రత్తగా తమ వ్యాపారాలను విస్తరిస్తున్నాయి.








కామెంట్లు (0)