తాడేపల్లిలో 27.73 ఎకరాలకు భూ సేకరణ
నోటిఫికేషన్ ఇచ్చిన సిఆర్డిఎ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాజధాని అమరావతి కనెక్టివిటీ కోసం ఏర్పాటు చేస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డును 16వ నెంబరు జాతీయ రహదారిలో కలిపేందుకు ప్రభుత్వం భూసేకరణకు సిద్ధమైంది. సీతానగరం నుండి తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రి వరకూ 23.68 ఎకరాలను సేకరించనుంది. 74 మంది రైతుల నుండి ఈ భూమిని సేకరించనున్నారు. ఎయిమ్స్ పక్క నుండి నిర్మిస్తున్న ఈ-13 రోడ్డును జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు మరో 4.05 ఎకరాలను సేకరించనున్నట్లు మరో ప్రకటన ఇచ్చారు. దీంతో రెండు చోట్ల మొత్తం 27.73 ఎకరాలను సిఆర్డిఎ సేకరించనుంది. రాజధాని అమరావతి ప్రధాన కనెక్టివిటీ రోడ్డుగా పేర్కొంటున్న సీడ్ యాక్సెస్ రోడ్డును ఉండవల్లి వరకూ నిర్మించారు. అక్కడ నుండి మణిపాల్ ఆస్పత్రి వరకూ ఎలివేటెడ్ కారిడార్ రూపంలో వంతెన నిర్మించనున్నారు. ఈ మధ్యలో రైల్వేలైన్ కూడా ఉంది. బోటుయార్డు, ఎన్టిఆర్ కట్టమీదుగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఇటీవల దీనికోసం భూపటిష్ట పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా 23.68 ఎకరాల భూమిలో 74 మంది యజమానులు ఉండగా.. వీటిల్లో పట్టా భూములు, అసైన్డ్ పట్టాలు, ఇళ్లు ఉన్నాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం వీటిని సేకరించనున్నామని, అభ్యంతరాలు ఉన్నవారు తెనాలి సబ్ కలెక్టర్కు తెలపొచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఈ-13 రోడ్డు కోసం 4.05 ఎకరాలు
అమరావతి నుంచి ఎర్రబాలెం పాత జాతీయ రహదారి మీదుగా ఎయిమ్స్ ఆస్పత్రి పక్క నుంచి డిజిపి ఆఫీసు సమీపంలోని గోపువారి కళ్యాణ మండపం వద్ద జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా ఈ-13 రోడ్డును నిర్మిస్తున్నారు. దీనికోసం ఎయిమ్స్ పక్కనున్న కొండను ఇప్పటికే చాలా వరకూ తవ్వేశారు. జాతీయ రహదారి కోసం అక్కడ కొంత భూమిని తీసుకోవాల్సి రావడంతో దానికీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక్కడ 4.05 ఎకరాలు సేకరించనున్నారు.








కామెంట్లు (0)