సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నర్సింగరావు
ప్రజాశక్తి- కలెక్టరేట్(విశాఖపట్నం) : రాష్ట్రంలో ఇనుప గనులను జిందాలు స్టీల్ ప్లాంట్కు కేటాయించడాన్ని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు తీవ్రంగా ఖండించారు. విశాఖపట్నం జగదాంబ జంక్షన్ సమీపంలోని సిఐటియు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకాశం జిల్లాలోని ఇనుప గనులు రాష్ట్ర ప్రభుత్వం జిందాల్ స్టీల్కు కేటాయించిందని, విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం కేటాయించలేదన్నారు. గత రెండేళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలంటూ ఒక్కసారైనా టిడిపి కూటమి ప్రభుత్వం అడగలేదని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు లేకపోవడమే ఏకైక సమస్య అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 18 నెలలు తరువాత విశాఖ స్టీల్ప్లాంట్ కొత్త సిఎండిగా తెలుగువారైన ఎంఎన్ఎస్ ప్రభాకర్ను నియమించిందని, ఆయన వచ్చిన 20 రోజుల్లో స్టీల్ప్లాంట్లోని ప్రధాన విభాగాల్లో ఆపరేషన్, మెయింటినెన్స్ పనులను పూర్తిగా ప్రైవేట్ వారికి అప్పగిస్తున్నారని తెలిపారు. సింటర్ ప్లాంట్ను టాటా కంపెనీకి కట్టబెట్టాలని నిర్ణయం అయిందన్నారు. విశాఖ స్టీల్ను వేగంగా ప్రైవేటుకు అప్పగించడానికే తెలుగు సిఎండిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. విశాఖలో వాయు కాలుష్యం ఢిల్లీని మించిపోయిందన్నారు. విశాఖ పోర్టు యాజమాన్యం కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభమైందని, అత్యంత లాభాలు గడించే కెకె లైన్ను, రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక కేంద్రం అయిన అరకుతో సహా ఒడిశాకు అప్పజెప్పడం కేంద్ర బిజెపి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్పై ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు.








కామెంట్లు (0)