రైల్వే పట్టాల పక్కన విగతజీవిగా సీమోన్..
విషాదంలో కుటుంబ సభ్యులు
యు.కొత్తపల్లి (ప్రజాశక్తి): వారాంతపు సెలవులకు ఇంటికి వస్తాడని ఆశగా ఎదురుచూసిన ఆ కుటుంబానికి గుండె కోత మిగిలింది. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీరంశెట్టి సీమోన్ (30) కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం రాత్రి వరకు కుటుంబ సభ్యులతో క్షేమంగా మాట్లాడిన యువకుడు, తెల్లవారేసరికి రైల్వే పట్టాల పక్కన శవమై కనిపించడంతో గ్రామంలో విషాద ఛాయలు అముముకున్నాయి. మృతుడు సీమోన్ చెన్నైలోని ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో శుక్రవారం రాత్రి చెన్నైలో రైలు ఎక్కిన ఆయన, రాత్రి 10 గంటల సమయంలో తన భార్య మరియు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. అయితే శనివారం ఉదయానికి ఆయన ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, ఆయన కార్యాలయానికి ఫోన్ చేయగా అక్కడ లేడని తెలిసింది. దీంతో అప్రమత్తమైన బంధువులు సెల్ఫోన్ సిగ్నల్ లొకేషన్ ఆధారంగా గాలింపు చేపట్టగా, గుడివాడ సమీపంలోని రైల్వే పట్టాల పక్కన సీమోన్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.








కామెంట్లు (0)