సింగరాయకొండ బావిలో మృతదేహం లభ్యం!
ప్రజాశక్తి-ఒంగోలు : హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి అదృశ్యమైన బీటెక్ విద్యార్థి రాహుల్ ఉదంతం తీవ్ర విషాదాంతంగా ముగిసింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతంలో ఒక బావిలో దూకి అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ధృవీకరించారు. పోలీసులు మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్ గత నెల 27న తాను టూర్కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. కాచిగూడ రైల్వే స్టేషన్లో శబరి ఎక్స్ప్రెస్ ఎక్కిన తర్వాత అతను కుటుంబానికి అందుబాటులోకి రాకుండా పోయాడు. రాహుల్ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, కుటుంబ సభ్యులు విస్తృతంగా గాలించినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే ఒంగోలు సమీపంలోని సింగరాయకొండ వద్ద ఉన్న ఒక బావిలో రాహుల్ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.








కామెంట్లు (0)