చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసఫ్ విజయ్ జూన్ 11న ఢిల్లీలో జరగనున్న నీతి అయోగ్ సమావేశంలో పాల్గొననున్నట్లు సంబంధిత వర్గాలు ఆదివారం తెలిపాయి. ప్రధాని మోడీ అధ్యక్షతన జూన్ 11న న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరుకానున్నారు. విజయ్ కేంద్రహోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను కలిసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీలో పర్యటించడం ఇది రెండవసారి. జాతీయ రాజధానిలో తన మొదటి పర్యటనలో విజయ్ ప్రధాని మోడీతో సమావేశమయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ 2.0 (ఉయిర్ నీర్ ఇయక్కం)ను అమలు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో ఈ నెల 2వ తేదీన ఒక అవగాహన ఒప్పందం (ఎంఒయు) కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ సమక్షంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ వర్చువల్ సంతకాల కార్యక్రమంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.తమిళనాడు వ్యాప్తంగా తాగునీటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, గృహాలకు సురక్షితమైన, సరిపడా తాగునీటిని నిరంతరాయంగా అందించడానికి ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన ముందడుగని అధికారిక ప్రకటన తెలిపింది.








కామెంట్లు (0)