నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రతినిధి లీలా శర్మ
గుంటూరులో అంతర్జాతీయ నాటకోత్సవం ప్రారంభం
ప్రజాశక్తి-గుంటూరు : నాటకం అనేది కేవలం వినోద సాధనం మాత్రమే కాదని, సమాజాన్ని ప్రశ్నించే శక్తివంతమైన సాధనమని, యువతలో సృజనాత్మక ఆలోచనలు పెంపొందించే గొప్ప విద్యాప్రక్రియ అని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా-న్యూఢిల్లీ ప్రతినిధి లీలా శర్మ అన్నారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, వేదిక (తెలుగు నాటకపరిషత్ల సమ్మేళనం-యడ్లపాడు) సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల పది వరకూ జరిగే ‘భారత్రంగ్ మహోత్సవం – అంతర్జాతీయ నాటక ఉత్సవం’ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రతినిధి లీలాశర్మ, బెంగుళూరు ప్రతినిధి వీణాశర్మ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ డైరెక్టర్ నాగభూషణం, ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి రామచంద్రరాజు, నాటకరంగ ప్రముఖులు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, నాయుడు గోపి, వేదిక సంస్థ అధ్యక్షులు ముత్తవరపు సురేష్బాబు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. లీలాశర్మ మాట్లాడుతూ.. భారత్రంగ్ మహోత్సవం వంటి అంతర్జాతీయ నాటక ఉత్సవాలు భారతీయ నాటక సాంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు నాటక కళ విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వీణాశర్మ మాట్లాడుతూ.. వివిధ భాషలు, సంస్కృతులు, జీవన విధానాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే శక్తి నాటకానికి మాత్రమే సాధ్యమని తెలిపారు. మొదటి రోజు మణిపూరి, కోరస్ థియేటర్ వారి ‘కనుప్రియ’నాటికను ప్రదర్శించారు. ధరమ్వీర్ భర్తీ రచించిన ఈ నాటికను పద్మశ్రీ రతన్థీయం దర్శకత్వం వహించారు. అంతకు ముదు వేదిక సంస్థ అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు, ఆయన సతీమణి అరుణకుమారి, కుమార్తె భార్గవి రిబ్బన్ కట్చేసి విజ్ఞాన మందిరంలోని భళ్లారి రాఘవ ఓపెన్ థియేటర్లోని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు.








కామెంట్లు (0)