ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ :
ఆంధ్రవిశ్వకళాపరిషత్ పేరుకు తగ్గట్టుగానే కళలకు స్థానంగా నిలచింది. దశాబ్దాలుగా భాష, సాహిత్యం, శాస్త్ర, సాంకేతిక రంగాలతో సమానంగా కళలకు ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు వెళుతోంది. దీనిలో ప్రధానమైన విభాగాలలో ఒకటైన చిత్రకళా విభాగం జాతీయ, అంతర్జాతీయ కళాకారులను తీర్చిదిద్ది అందించింది. 1977లో తొలిబ్యాచ్ నుంచి నేటి వరకు చిత్రకళా విభాగంలో చదువుకున్న విద్యార్థులు తీర్చిద్దిన చిత్ర, శిల్ప కళా ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంటోంది. బీచ్రోడ్డులోని ఎయు కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిర్వహిస్తున్న శతాబ్ధి వారోత్సవాలలో ఎయు చిత్రకళా విభాగం విద్యార్థులు, పూర్వవిద్యార్థులు, ఆచార్యుల చిత్ర, శిల్ప కళా ప్రదర్శనను ముఖ్య అతిథి, ప్రముఖ చిత్రకారులు ఆచార్య జి.రవీందర్రెడ్డి ప్రారంభించారు. ఎయు విసి ఆచార్య జిపి.రాజశేఖర్, విశ్రాంత ఆచార్యులు ఆచార్య వి.రమేష్, మయూఖ కుమారిదేవి, విభాగ ఆచార్యులు శిష్ల్ట శ్రీనివాస్, విభాగాధిపతి డి.సింహాచలం తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిత్రకళా ప్రదర్శనను అతిధులు తిలకించి అభినందించారు. ప్రదర్శనలో భాగంగా డ్రాయింగ్, పెయింటింగ్, శిల్పాలు తీర్చిద్దిన విధానం అందరినీ ఆకట్టుకున్నాయి. ఆయిల్ పెయింట్, ప్రింట్, దారు శిల్పాలు, పిఒపి, ఇత్తడి, మౌల్డ్లో తయారుచేసిన శిల్పాలు ప్రకృతిని, సామాజిక పిరిస్థితులు, మానవ ఆలోచనలకు ప్రతిరూపాలుగా నిలిచాయి. ప్రతీ చిత్రం, శిల్పం వెనుక దాగివున్న ఆలోచనలు వాటిని తయారుచేసిన, తీర్చిదిద్దిన విద్యార్థులు వివరించిన విధానం ఎంతో ఆకట్టుకుంది. కళాభిమానులకు, చిత్రకళాభిరుచి కలిగిన వారికి ఈ ప్రదర్శన ఎంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహించే ఈ ప్రదర్శన నగరవాసులు తిలకించాలని విభాగాధిపతి ఆచార్య సింహాచలం సూచించారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ఎల్జి ఇండియా సిఎస్ఆర్ సంగ్ యున్ కిమ్ తదితరులు పాల్గొని ప్రదర్శనను తిలకించారు.








కామెంట్లు (0)