అమ్మకానికి ఎపి పట్టణాలు
దొడ్డిదారిన మళ్లీ చెత్త పన్ను
వ్యాపార సంస్థలుగా మున్సిపాలిటీలు
వికసిత్ ఏపీ పేరిట వినాశకర ప్రైవేటీకరణ విధానాలు
మున్సిపల్ స్థలాలు, సర్వీసులను ప్రైవేటేకరిస్తూ జీవో 673 విడుదల
ప్రతి పనికి రేటు కట్టి ఫీజులు వసూలు చేయనున్న మున్సిపాలిటీలు
ఖాళీ స్థలాలు, కాంప్లెక్స్లు, కార్యాలయాలు.. సర్వం 99 ఏళ్లకు బడా కంపెనీలకు లీజులు
జీవో 673 ఉపసంహరించాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు
విజయవాడ : ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమైన జీవో 673 ఉపసంహరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి.కాశీనాథ్ తో కలిసి మాట్లాడారు.
బాబురావు మాట్లాడుతూ …. రాష్ట్రంలో కూటమి, ఎన్డీఏ పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మున్సిపాలిటీలను ప్రైవేటీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 673 విడుదల చేయటం శోచనీయమన్నారు. వికసిత్ భారత్, ఏపీ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినాశకర విధానాలు చేపట్టడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలోని 123 కార్పొరేషన్ లు, మున్సిపాలిటీలు, 21 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలలోని ఆస్తులను బడా కంపెనీలకు ధారాదత్తం చేయడానికి పూనుకోవటం గర్హనీయమన్నారు. మున్సిపల్ స్థలాలు, కమర్షియల్ కాంప్లెక్స్ లు, కార్యాలయాలు, పార్కులు, ఆడిటోరియంలు, స్టేడియంలు… సర్వం.. కారు చౌకగా ప్రైవేటీకరణ ముసుగులో బడా సంస్థలకు దాఖలుపరిచే ప్రయత్నాలు ప్రమాదకరమని హెచ్చరించారు. మంచినీటి సరఫరా, డ్రైనేజీ, పారిశుద్ధ్య నిర్వహణ, వీధిలైట్లు మొత్తం పౌర సేవలను వ్యాపార పరం చేస్తూ ఆదేశాలు ఇవ్వడం హానికరమన్నారు. గత ప్రభుత్వంలో రుద్దిన చెత్త పన్నును, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు, పోరాడారు, ఫలితంగా చెత్త పన్ను రద్దయింది అని అన్నారు. కూటమి ప్రభుత్వం యూజర్ చార్జీల పేరుతో చెత్త పన్ను, మంచినీరు, డ్రైనేజీ తదితర పౌర సేవలు అన్నింటి పైన భారం వేయటానికి ఆదేశాలు ఇవ్వటం నమ్మకద్రోహమేనన్నారు. ఒకవైపున పేదలకు పట్టాలిస్తాం అని.. మురిపిస్తూ.. మరోవైపున పేదల మురికివాడలను తొలగించి, ప్రైవేట్ కంపెనీల స్థలాలను కట్టబెట్టి పేదల పొట్ట కొట్టడానికి కూటమి సర్కార్ కుట్ర పన్నుతోందన్నారు. పట్టణాభివృద్ధికి 45 వేల కోట్ల రూపాయల నిధులు అవసరమని.. ప్రభుత్వం వాటిని సమకూర్చలేదనే సాకుతో.. పట్టణాలను బడా సంస్థల దయాదాక్షిణ్యాలకు వదిలిపెట్టడం తగదు అని చెప్పారు. పట్టణాలలో పౌర సదుపాయాలను కల్పించలేక ఎన్డీఏ ప్రభుత్వం చేతులెత్తేయటం బాధాకరమన్నారు. పట్టణ స్థానిక సంస్థలను కార్పొరేట్ సంస్థలుగా చేయటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపారు. పౌర సదుపాయాలన్నిటిని వ్యాపార సరుకులుగా మార్చుతోందన్నారు. ప్రజల ఆస్తులను బడా కంపెనీలకు కట్టబెట్టటమే కాకుండా, వయబుల్ గ్యాప్ ఫండింగ్ పేరుతో వారికి ప్రభుత్వ నిధులను కూడా సమకూర్చటానికి సర్కార్ ఆదేశాలు ఇవ్వటం తగదు అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ 99 బ్రాండ్ గా మార్చుకున్నారు, 99 పైసలకే కార్పొరేట్లకు భూములు కట్టబెడుతున్నారు, ఇప్పుడు 99 సంవత్సరాలు పాటు మున్సిపల్ ఆస్తులను ధారధక్తం చేస్తున్నారు, 99 ప్రభుత్వంగా మారిపోయిందన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలను నడుపుతున్న మంత్రి నారాయణ మున్సిపాలిటీలను కూడా కార్పొరేట్ సంస్థలుగా మార్చే ప్రయత్నాలు చేయటం దుర్మార్గమన్నారు. అభివృద్ధి పేరుతో వినాశకర విధానాలను పాలకులు చేపట్టారని మండిపడ్డారు. ఒకవైపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రూపాలలో పన్నులు వసూలు చేస్తూ, స్థానిక సంస్థలలో ప్రతి సంవత్సరం ఇంటి పన్ను 15% చొప్పున, ఐదేళ్లలో 130% పైగా పెంచారని అన్నారు. మళ్లీ ప్రతి పనికి రేటు కట్టి యూజర్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించడం విచారకరమన్నారు. మున్సిపల్ సర్వీసుల ప్రైవేటీకరణతో ఉద్యోగుల, కార్మికుల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని చెప్పారు. స్థానిక సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోతాయన్నారు. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం లో రోడ్ల ప్రైవేటీకరణ ప్రారంభమైందని తెలిపారు. విజయవాడలో వాణిజ్యసముదాయాలను అభివృద్ధి పేరుతో కూల్చడానికి సన్నాహాలు చేస్తున్నారు, భవాని ఐలాండ్ ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఆర్టీసీ స్థలాలను లూలూ కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నాలు చేశారు, బస్ డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారు అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమైన జీవో 673 ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా సిపిఎం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతుందని, ప్రజలందరూ ఈ విధానాలను నిరసించాలని పిలుపునిచ్చారు. అనంతరం కాశీనాథ్ మాట్లాడుతూ …. ప్రజల ఆస్తులను సొంత సొమ్ము లాగా కేటాయింపులు చేయటం పాలకులకు తగదు అని అన్నారు. మున్సిపాలిటీలలో వాహన డిపోలలో ప్రైవేటు వాహనాలను ప్రవేశపెట్టి కార్మికులను దెబ్బతీయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పిపిపి ముసుగులో రోడ్లను ప్రైవేటు కంపెనీలకి కట్టబెడుతూ నడకను వ్యాపారంగా మారుస్తున్నాయన్నారు. యూజర్ చార్జీలో ముసుగులో ప్రజలపై భారాలు వేయటం తగదు అని చెప్పారు. ఐక్య ఉద్యమం ద్వారా వీటిని తిప్పికొడతామని హెచ్చరించారు.








కామెంట్లు (0)