బ్లాస్ట్ ఫర్నేస్-2లో ఉత్పత్తికి బ్రేక్!
పునరుద్ధరణ పనుల్లో ఉద్యోగులు, కార్మికులు
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : నాలుగేళ్లుగా విభాగాల నిర్వహణను యాజమాన్యం గాలికి వదిలెయ్యడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ను అనిశ్చితి వీడడం లేదు. ఉత్పత్తికి ఏదో ఒక అవాంతరం ఏర్పడుతూనే ఉంది. కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయానికి తగ్గట్టుగానే ఉక్కు ప్రగతి ముందుకు సాగకుండా కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ర్టంలోని టిడిపి కూటమి నేతలు కేంద్రానికి వత్తాసు పలుకుతున్నారే తప్ప, ప్లాంట్ వాస్తవ పరిస్థితి తెలిసినా చక్కదిద్దే పనిచేయడం లేదు. ప్లాంట్లో మూడు బ్లాస్ట్ ఫర్నేస్లకుగానూ బిఎఫ్-2లో ఆదివారం రాత్రి నుంచి ఉత్పత్తి నిలిచిపోయింది. ఇది పూర్తి స్థాయిలో పనిచేయాలంటే కనీసం మూడు రోజులు పడుతుంది. దీన్ని పునరుద్ధరించే పనిలో కార్మికులు నిమగ్నమయ్యారు. ప్లాంట్లోని మూడు బ్లాస్ట్ ఫర్నేస్లకుగానూ ఒక్కొక్క దాన్నుంచి రోజుకు 17 వేల టన్నుల ఉక్కు ఉత్పత్తి జరుగుతుంది. బ్లాస్ట్ ఫర్నేస్-2లో ఏర్పడిన అంతరాయంతో ఉత్పత్తి గణనీయంగా పడిపోనుంది. రా మెటీరియల్లో వచ్చిన సమస్యలే అందుకు కారణమని భావిస్తున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయి ఉత్పత్తి రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్లాంట్కు ఈ అవరోధం గోరుచుట్టుపై రోకలిపోటులా పరిణమించింది. ఒక బ్లాస్ట్ ఫర్నేస్కు 19 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం 17 వేల టన్నుల ఉత్పత్తే వస్తోంది. ఇప్పటికే ఉత్పత్తితో ముడిపెట్టి ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నందున ఉత్పత్తి అవాంతరాలు పెరిగితే కార్మికులను మరిన్ని కష్టాలు చుట్టుముట్టనున్నాయి. సాంకేతిక కారణాలు, నాణ్యమైన రా మెటీరియల్ కొరవడటంతో తరుచూ ప్లాంట్లో సమస్యలు వస్తున్నాయి.
కాపాడే యత్నం అంటూనే…
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఎంతో ఆర్థిక తోడ్పాటును ప్లాంట్కు ఇస్తూ కాపాడే యత్నాల్లో ఉన్నాయంటూ టిడిపి కూటమి సర్కారు ప్రచారం చేస్తోంది. గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకూ సుమారు 1,800 మంది విఆర్ఎస్ తీసుకున్నారు. రూ.100 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉన్నా యాజమాన్యం ఇవ్వడం లేదు. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న జీతాలు రూ.300 కోట్ల పైమాటే. లీవ్ ఎన్క్యాష్మెంట్ బకాయిలు రూ.కోట్లలోనే ఉన్నాయి. ఉక్కులో ఆరు సంవత్సరాల నుంచీ ఉద్యోగులకు ప్రమోషన్స్ లేవు. ప్రతినెలా సరాసరి వంద మంది రిటైర్ అవుతున్నా రిక్రూట్మెంట్ జరగడం లేదు. గడిచిన నాలుగేళ్లుగా ప్లాంట్లో ఎలాంటి మరమ్మతులూ జరగడం లేదని కార్మికులు వాపోతున్నారు. ప్రతి డిపార్టుమెంట్లోనూ సమస్యలు కొలువై ఉన్నాయి. వాటిని వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు.








కామెంట్లు (0)