ఇద్దరు ఉద్యోగులకు అస్వస్థత
ప్రజాశక్తి – ముంచంగిపుట్టు (అల్లూరి జిల్లా) : ఆంధ్ర – ఒడిశా సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న మాచ్ ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా శనివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఉద్యోగులు పరుగులు తీశారు. మంటల్లో చిక్కుకుపోయిన ఇద్దరు ఉద్యోగులను సహచరులు కాపాడారు. గుండె, ఛాతీలో సమస్యలు తలెత్తడంతో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్య సేవల నిమిత్తం లంతాపుట్టు ఆస్పత్రికి తరలించారు. జల విద్యుత్ కేంద్రంలోనీ రెండో అంతస్తులోగల పంప్ హౌస్ వద్ద కేబుల్ దగ్ధమై మంటలు చెలరేగాయని, అక్కడ ఉన్న ఉద్యోగులు అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఫలించలేదని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ప్రమాద విషయం తెలిసి మాచ్ ఖండ్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రాజెక్టుకు భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.








కామెంట్లు (0)