మానవ సమాజ చరిత్రలో వరి వ్యవసాయక తొలి దశ, 10,000-12,000 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. అది వేట-సేకరణ యుగం. మగవాళ్లు వేటకు వెళితే, ఆడవాళ్లు గింజలు, పండ్లు, కాయలు సేకరించేవారు. ఆ క్రమంలో...తిన్న పండ్లలో గింజలు తీసి, నేల పైకి విసిరిస్తే అవి తగిన వాతావరణ సమయంలో మొలకెత్తాయి. మహిళలు దీన్ని గమనించి గింజలను భద్రపరిచి, నాటడం ప్రారంభించారు. బాగా ఎండిన విత్తనమే, మొలకెత్తుతుందని అనుభవంతో గ్రహించారు. ఆ విధంగా వ్యవసాయానికి ఆదిమ మహిళలే మూలకర్తలు. అనేక రకాల ధాన్యపు గింజలను సేకరిస్తే, వాటిలో ఆహారానికి ఏవి పనికొస్తాయో! నిర్ధారించుకున్నారు. వాటిలో వరి ప్రధానమైనది. ఆ విధంగా ఆది వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా మహిళలే!
ఆనాటి నుంచి ఈనాటి వరకు వ్యవసాయ రంగంలో మహిళలదే ప్రధాన పాత్ర. ఆధునిక యుగంలో, యాంత్రికత ప్రవేశించిన తరువాత, గ్రామీణ మహిళల పాత్ర నామమాత్రం అయిపోతోంది. కానీ, ఆదివాసీ మహిళలు మాత్రం ఆది సంప్రదాయ బాధ్యతలకు దూరం కాకపోవడం చరిత్ర చేసుకున్న పుణ్యం.
ప్రపంచ జనాభాలో సగం మందికి ఆహారం వరి బియ్యం. పురాతన ఆధారాల ప్రకారం దీన్ని, 9-10 వేల సంవత్సరాల క్రితం చైనాలోని యాంగ్జీ నదీ పరీవాహక ప్రాంతంలో సాగు చేసినట్టు ఆధారాలు దొరికాయి. భారతదేశానికి వాణిజ్య మార్గాల్లో, వరి విత్తనాలు చేరి ఉంటాయని శాస్త్రవేత్తల అంచనా! గంగా నది పరిసరాల్లోని 'లహురా దేవా' అనే ప్రాంతంలో 8500 ఏళ్ల నాటి ఆనవాళ్ళు దొరికాయి ( అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రకు వచ్చి, ఇక్కడి నుంచే గ్రీస్ కి వరి విత్తనాలు పట్టుకెల్లారట!). వేల ఏళ్ల క్రితమే, భారతీయ ఆదివాసీ మహిళలు, వరి కేవలం పొట్ట నింపే ఆహారమే కాదు; ఔషధ గుణాలు కలిగి ఉన్నట్టు కూడా కనుగొన్నారు ( తొలి దశ ఎథ్నోబట్లనిష్టులు). అందుకే, ప్రాచీన కాలపు విత్తనాల సంరక్షణకు వాళ్ళు శ్రద్ధ చూపించారు. వరి విత్తనాన్ని ఏ సీజన్లో నాటితే పండటానికి ఎన్ని దశలు ఉంటాయో! కోతకు ఎన్ని నెలలు పడుతుందో! గమనించారు. తొలకరి మాసం సరైనదని నిర్ధారించుకున్నారు (ఆ తరువాత నైరుతి రుతుపవనాల పేరుతో ఆధునికుల నిర్ధారణ). ఆదివాసీ మహిళలకు విత్తనం ఎంతో పవిత్రమైంది. భావితరాలకు జీవశక్తి నిచ్చేదని అర్థమైంది. అమ్మ దేవత అనే భావన ప్రారంభమైంది. భద్రపరిచిన విత్తనాలను ప్రస్తుత సంక్రాంతి కాలంలో పైకి తీసి, పరిశుద్ధపరిచి, ఏప్రిల్-జూన్ మాసాల మధ్య తొలకరి జల్లులు ఎప్పుడు కురిసినా నాటడం ఒక జీవన విధానమయింది. ఆదివాసులు నేటికీ చాలా ప్రాంతాల్లో సంక్రాంతి పండుగను నెల రోజులపాటు చేసుకుంటారు. నాటే ముందు, గ్రామ దేవత దగ్గరకు తీసుకువెళ్లి, పూజలు చేసి ‘బాగా పండాలని దీవించు తల్లీ...’ అని ప్రార్థిస్తారు. ఆ తరువాత సంప్రదాయ సంగీత, వాద్య, నృత్య, గానాలతో పండగ చేసుకుంటారు. అదే 'విత్తనాల పండుగ'. అనేక రాష్ట్రాల్లో, ఆయా భాషల పేర్లతో నిర్వహిస్తారు. అరకు మన్యంలో 'సంజీవని' అనే సంస్థ ఆరవ దేశీయ విత్తన ఉత్సవాన్ని' కిల్లో గూడ' అనే గ్రామంలో, గత ఏప్రిల్ లో నిర్వహించింది. ఈ గ్రామాన్ని ఎంచుకోవడానికి ఓ బలమైన కారణం ఉంది. ఈ గ్రామస్తులు ఏటా, పాత విత్తనాల పండుగ చేసుకుంటారు. విత్తనాలను పల్లకిలో ఉంచి ఊరేగిస్తారు. అనంతరం పూజలు చేస్తారు. ఈ అరుదైన సంప్రదాయానికి కొనసాగింపుగా సంజీవని సంస్థ ఈ ఉత్సవాన్ని నిర్వహించింది.పాత విత్తనాల సేకరణ, సంరక్షణలోనూ మహిళలదే ప్రధాన పాత్ర. దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఆదివాసీలు ఉన్న రాష్ట్రం ఒడిశా. తరతరాలు నుంచి దాదాపు రెండువేల రకాల వరి వంగడాలను ఆదివాసులు సేకరించి, భద్రపరిచారు. వీటిలో 'కాలా జీర్' రకాన్ని ' ప్రిన్స్ ఆఫ్ రైస్ ' అంటారు. ఇది, జీలకర్ర లాంటి సన్నటి ,నల్లటి గింజలతో పండుతుంది. మధుమేహ నియంత్రణ, జ్ఞాపకశక్తి, హిమోగ్లోబిన్ స్థాయి పెంచడానికి బాగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి భౌగోళిక సూచిక (జి.ఐ) వుంది. 1999 భౌగోళిక సూచికల (నమోదు, రక్షణ) చట్టం కింద, విశిష్ట లక్షణాలు, సంప్రదాయ ఉత్పత్తులు, వాటి గొప్పదనం గుర్తించి వారసత్వ పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన ముఖ్యమైన వారసత్వ వ్యవస్థ ప్రదేశంగా (జి.ఐ.ఎ.హెచ్.ఎస్) కోరాపుట్ ఆదివాసీ వ్యవసాయ ప్రాంతం గుర్తింపు పొందింది. మన దేశానికి చెందిన 'ప్రొటక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీ అండ్ ఫార్మర్స్ అథారిటీ' నుండి పంచబటి గ్రామ' ఉన్నయిన సమితి' 2006 జీనోమ్ అవార్డు అందుకుంది. ప్రపంచంలోనే ఏ జీవ వైవిధ్య సంపన్న దేశంలోనూ ఇటువంటి అవార్డు ఏ ప్రాంతానికీ రాలేదన్నారు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఎం.ఎస్. స్వామినాథన్ (2007).
పెద్దగా నీటి అవసరం లేని, వర్షాభావాన్ని, వాతావరణ మార్పులను తట్టుకొని, నిలబడి దిగుబడులనిచ్చే విలువైన రకాలు ఆదివాసుల సంరక్షణలో ఉన్నాయి. వాటిలో కొన్ని-మచ్చ కుంట (ఒడిసా), తురియా కబ్రి, చూడిధాన్, లోక్తిమాచి (చత్తీస్ గఢ్). విస్తారమైన వరి సాగు, ఉత్పత్తికి ఛత్తీస్ గఢ్ పెట్టింది పేరు. ' మధ్య భారత దేశపు వరి గిన్నె ' అనే గౌరవం సంపాదించింది. దంతెవాడ ప్రాంతంలో పండే 'బాసా బోగ్ ' రకానికి గొప్ప డిమాండ్. చిన్న గింజలు, సువాసన దీని ప్రత్యేకత. కాకపోతే, మధ్యస్థ రకం. వేసవి సాగుకు అనుకూలం. వేగంగా జీర్ణమయ్యే గుణం కలిగి ఉండటం వల్ల చిన్న పిల్లలకు, వృద్ధులకు చాలా ఉపయోగపడుతుంది. చత్తీస్ గఢ్ లో దాదాపు 23 వేలకు పైగా ప్రాచీన వరి వంగడాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లు పరిశోధించి తెలుసుకున్నారు. అయితే, ఆ విషయం తరతరాల నుంచి ఆదివాసులకు తెలుసు. వీటి సంరక్షణలోనూ మహిళలదే ప్రధాన పాత్ర. కొన్నేళ్ల నుంచి స్వచ్ఛంద సంస్థలు తోడై ' సీడ్ బ్యాంకులు' ఏర్పాటు చేస్తున్నాయి. విదేశీ బహుళ జాతి కంపెనీలు 'పేటెంట్' పేరుతో వీటిపై కన్నేశాయి. ఆదివాసులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఒక ఉద్యమ శక్తిగా మారి, ఆ ప్రయత్నాలను తిప్పికొట్టారు. రాయపూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం సేకరించిన 22,972 వరి జన్యువులను 'సింజెంటా' వంటి విదేశీ సంస్థలు సొంతం చేసుకునే ప్రయత్నాలు చేశాయి. వీటిని 'విత్తన సత్యాగ్రహం ' ద్వారా ఆదివాసులు అడ్డుకున్నారు. సంస్థలు, ఆయా ప్రాంత రైతు సంఘాలు వారికి అండగా నిలిచాయి. జార్ఖండ్ లో ముండా, ఒరాన్ తెగలవారు పురాతన విత్తన సంపదను సంరక్షిస్తున్నారు. ఇక్కడ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐ.సి.ఎ.ఆర్) తో కలిసి, కార్డెవా వంటి విదేశీ సంస్థలు కూడా కృషి చేస్తున్నాయి. కర్ణాటకలో అంతరించిపోతున్న విత్తనాలను, 'కాగల్ ' గ్రామ పరిసరాల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. స్వచ్ఛంద సంస్థ ఒకటి ' సీడ్ బ్యాంక్ 'ఏర్పాటు చేసింది. జర్మనీ కాన్సులేట్ దీన్ని పర్యవేక్షిస్తుంది. ఒడిశా ఆదివాసి ప్రాంతాల్లో ప్రత్యేకంగా ,కొన్ని అరుదైన రకాలు ఉన్నాయి. బలహీనమైన నేలల్లో పండే 'ఉమిరియా చూడి ', పోషక విలువలు గల 'దొడి కబురి', స్థానిక వాతావరణానికి సరిపోయే 'హలాడి బుడి' వంటి రకాలను సంరక్షించడానికి స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కృషి చేస్తున్నది. కొన్ని సంస్థలతో కలిసి సామాజిక విత్తన బ్యాంకులను ఏర్పాటు చేసింది.
తరతరాల పురాతన విత్తనం అమూల్యమైనదని గుర్తించింది, తొలి వ్యవసాయ అనుభవ శాస్త్రవేత్తలైన ఆదివాసీ మహిళలే! వేల ఏళ్ల వారసత్వ విత్తన సంపదకు ఈనాటికీ సంరక్షకులు వారే! హైబ్రిడ్ విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగు మందులుతో సాగు వల్ల కలుగుతున్న నష్టాలను, మధ్యప్రదేశ్ లోని తేజిలీబాయి అనే మహిళ 15 ఏళ్ల క్రితం గుర్తించింది. అలీ రాజ్ పూర్, దేవాస్ జిల్లాల్లోని 'బిల్' ( బిల్ల) తెగ మహిళల సాయంతో అనువంశిక విత్తనాలు సేకరించి సేంద్రీయ వ్యవసాయాన్ని పునరుద్ధరించింది. కోరాపుట్ లోని 'నువా గుడా' కు చెందిన చంద్రమా మహియా అనే మహిళ చేసిన కృషికి 2006లో, రాష్ట్ర స్థాయి 'ఫోక్' అవార్డును ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది.
' పద్మశ్రీ ' కమలా పూజారి
అనాది కాలపు విత్తనాల సేకరణ, సంరక్షణకు కమలా పూజారి అనే ఆదివాసి మహిళ చేసిన కృషి, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. కోరాపుట్ జిల్లాలోని పాత్రపుట్ లో 1949 -50 మధ్యకాలంలో ఆమె జన్మించింది. సహ సమాజ జీవన అనుభవాలతో పురాతన విత్తనాలను సేకరించి, అది తన జీవన విధానంలో భాగంగా మార్చుకుంది. జైపూర్ లోని డాక్టర్ స్వామినాథన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఆమె తపనను గమనించి, పిలిపించి శాస్త్రీయమైన మెలకువలను నేర్పింది. ఆ తరువాత, ఆమె దాదాపు వంద వరి విత్తనాలతో పాటు పసుపు, జీలకర్ర వంటి ఇతర విత్తనాలను కూడా సేకరించి సంరక్షించింది. దీంతో, ఆమె పేరు ఒడిశాలోనే కాకుండా, దేశం ఎల్లలు కూడా దాటిపోయింది. 2002లో జోహాన్నెస్ బర్గ్ (దక్షిణ ఆఫ్రికా) లో ' ఈక్వేటర్ ఇనీషియేటివ్ అవార్డు' అందుకున్నారు. 2004లో ఒడిశా ప్రభుత్వం రాష్ట్ర ఉత్తమ మహిళా రైతు అవార్డు ప్రకటించింది. ఢిల్లీలో ' కృషి బిశరథ సమ్మాన్ ' అవార్డు లభించింది. ఒడిస్సా ప్రభుత్వం, రాష్ట్ర ప్రణాళిక సంఘ సభ్యురాలుగా నియమించింది. ఈ గౌరవం దక్కిన ఏకైక ఆదివాసీ మహిళ కమల. 2022 మార్చి 16న రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అందుకోవడం, ఆమె కృషికి దక్కిన గుర్తింపు, గౌరవాలకు పతాక ఘట్టం. అనాది విత్తన సంరక్షకులైన ఆదివాసీ అమ్మలందరినీ ఈ అవార్డుతో గౌరవించినట్టయింది.
- వ్యాసకర్త: నల్లి ధర్మారావు,
సీనియర్ జర్నలిస్ట్,
కవి, రచయిత








కామెంట్లు (0)