test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆదివాసీల అస్తిత్వం, విశ్వాసాలపై ఆధిపత్యపు నీడ

5 రోజుల క్రితం

birsa munda.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 03, 2026, 05:15 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

గత వారం, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అనుబంధ సంస్థలైన జన్ జాతి సురక్షా మంచ్ (జెఎస్ఎం), వనవాసి కళ్యాణ్ ఆశ్రమం (వికెఎ) సంయుక్తంగా ఢిల్లీలో “జన్ జాతి సాంస్కృతిక్ సమాగమం” పేరిట ఒక భారీ సదస్సును నిర్వహించాయి. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వేలాదిమంది ఆదివాసీలు హాజరయ్యారు. ఆదివాసీ పోరాట యోధుడు బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
​ కృతజ్ఞతా తీర్మానంలో భాగంగా, నిర్వాహకులు ఈ సదస్సు వెనుక ఉన్న విస్తృతమైన ప్రభుత్వ యంత్రాంగ సహాయాన్ని బహిరంగంగానే అంగీకరించారు – రైల్వే మంత్రిత్వ శాఖ నుండి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రుల నుండి ఉన్నతాధికారుల వరకు అందరూ దీనికి సహకరించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనికి ముఖ్య అతిథిగా హాజరవడంతో, ఈ కార్యక్రమం దాదాపు ఒక అధికారిక ప్రభుత్వ కార్యక్రమంలాగా సాగింది. సాంస్కృతిక సమ్మేళనంలా పైకి కనిపిస్తున్నప్పటికీ, ఇందులో చేసిన ప్రసంగాలు, లేవనెత్తిన డిమాండ్లు, హోం మంత్రి స్పందనలను మరింత నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.​
క్రైస్తవ మతంలోకి మారిన ఆదివాసీలపై వ్యతిరేకతను ప్రదర్శించడమే జెఎస్ఎం ప్రధాన ఎజెండా. క్రైస్తవ మతంలోకి మారిన ఆదివాసీలందరినీ షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితా నుండి తొలగించాలని, వారికి లభించే రాజ్యాంగపరమైన, చట్టపరమైన రక్షణలను రద్దు చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి వారు చెప్తున్న కారణం ఏంటంటే – మతం మారిన ఆదివాసీలు ఇంకెంత మాత్రం ఆదివాసీల సాంప్రదాయ విశ్వాసాలను పాటించడం లేదని.
ఈ సంస్థ మధ్య భారతదేశంలోని పలు రాష్ట్రాలలో, ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో క్రైస్తవ మతంలోకి మారిన ఆదివాసీ కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక ఆందోళనలు నిర్వహించింది. ఈ ఆందోళనలు ఎంత తీవ్ర స్థాయికి చేరాయంటే, గిరిజన గ్రామాల్లోని ప్రైవేట్ యాజమాన్యంలోని భూములలో ఉన్న క్రైస్తవ ఆదివాసీల సమాధుల నుండి మృతదేహాలను బలవంతంగా వెలికి తీయడం దాకా సాగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఒక కేసులో, ఇటువంటి చర్యలను నిలిపివేయాలని కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ, బిజెపి రాష్ట్ర ప్రభుత్వాల అండదండలతో ఈ తరహా సంఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

మౌలిక వ్యత్యాసం

సదస్సులో క్రైస్తవ ఆదివాసీలను ఎస్.టి జాబితా నుండి తొలగించాలనే డిమాండ్‌ను, 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఆధారంగా రూపొందించారు. ఆ ఉత్తర్వు ప్రకారం, “హిందూ మతం మినహా” ఇతర మతాలను స్వీకరించిన షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వ్యక్తులు రాజ్యాంగ లేదా చట్టపరమైన ప్రయోజనాలకు అర్హులు కారు. జెఎస్ఎం డిమాండ్ ఏంటంటే, ఇదే సూత్రాన్ని షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ) కూడా వర్తింపజేయాలని. ఆ సంస్థ నాయకులలో ఒకరు దీనిని “రాజ్యాంగంలోని ఒక బలహీనత” గా అభివర్ణించారు. అయితే, జెఎస్ఎం దేనినైతే బలహీనతగా భావిస్తుందో, అది వాస్తవానికి ఒక ప్రాథమిక మౌలిక వ్యత్యాసం. ఎస్సీల విషయంలో లాగా కాకుండా, భారత రాజ్యాంగం గానీ, చట్టం గానీ ఎస్టీల గుర్తింపును ఏ మతంతోనూ ముడిపెట్టలేదు.
​ ఈ సదస్సు వేదికపై, బిర్సా ముండా చిత్రపటాలతో పాటు, హిందూ దేవత రూపంలో మార్చిన “భారత మాత” చిత్రం, ఒకప్పుడు ఒరాన్ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు సభ్యులు క్రైస్తవులనే కారణంతో ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానం నుండి పోటీ చేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన మాజీ కాంగ్రెస్ ఎంపీ కీ.శే కార్తీక్ ఒరాన్ చిత్రపటాన్ని కూడా ఉంచారు. 1963లో పాట్నా హైకోర్టు ఈ పిటిషన్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. “గిరిజన గుర్తింపు అనేది మతం ఆధారితమైనది కాదు” అని, అది జాతి, సమాజ బంధాలపై ఆధారపడి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఒక ఒరాన్ వ్యక్తి హిందువైనా, క్రైస్తవుడైనా లేదా బౌద్ధుడైనా అతడు “ఒరాన్” గానే ఉంటాడని స్పష్టం చేసింది.
​ మతం మారిన ఆదివాసీలు సామాజిక పండుగలు, వేడుకలలో పాల్గొంటూనే ఉన్నారని, ఇతర ఆదివాసీ సమాజాల సాధారణ సమస్యలపై కలిసి వస్తున్నారని హైకోర్టు తీర్పు గుర్తించింది. ఈ తీర్పే ఇప్పటికీ అమలులో ఉన్న చట్టపరమైన నిదర్శనం. జెఎస్ఎం దీనిని తారుమారు చేయాలని చూస్తోంది. ఇందుకు వారు అనుసరిస్తున్న పద్ధతి భయానకంగా, క్రూరంగా ఉంది. మతం మారిన కుటుంబాలను వెలి వెయ్యడం, సామాజిక పండుగలకు హాజరు కాకుండా బలవంతంగా నిరోధించడం, ఆ తర్వాత ఆ వెలిని సాకుగా చూపి వారు ఆదివాసీ సంస్కృతిని వదిలేశారని ప్రచారం చేయడం, సాంప్రదాయ గ్రామ సభల నుండి వారిని బహిష్కరించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. మొదటగా వాళ్ళే బహిష్కరణకు పాల్పడి ఆనక దాన్నే సాక్ష్యంగా చూపుతున్నారు.

అంటు కట్టుడు ప్రచారం

అదే సమయంలో, ఆదివాసీలు విస్తృతమైన “సనాతన పరివార్” లో భాగమేననే వాదాన్ని జెఎస్ఎం బలంగా ప్రచారంలో పెడుతోంది. ఈ సదస్సులో, ఆ సంస్థ జాతీయ కన్వీనర్ “ఆదివాసీలు హిందువులు కారని కొందరు అంటున్నారు. ఏమిటీ నాటకం? మనం రాముడి బిడ్డలం – ఇది మనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర” అని ప్రకటించారు.
​ మరొక నాయకుడు మాట్లాడుతూ, “ఆదివాసీలు సనాతన అనే మహా వృక్షం నీడలోనే మనుగడ సాగిస్తున్నారు” అని ప్రకటించారు. మతం మారిన వారి కోసం జెఎస్ఎం నిర్వహిస్తున్న “ఘర్ వాపసి” స్వభావం కూడా ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంది – ఈ కార్యక్రమాలలో ఆదివాసీ చిహ్నాలు కాకుండా హిందూత్వ చిహ్నాలు కనిపిస్తాయి. జెఎస్ఎం ప్రాపంచిక దృక్పథంలో ఆదివాసీలు “వనవాసులు” (అడవిలో నివసించేవారు) శ్రీరామునికి సేవ చేయడం ద్వారా గుర్తింపు పొందారని, ఉన్నత కులాల దేవతలకు లొంగి ఉంటారని, వారి ఆశీస్సుల ద్వారా మాత్రమే విముక్తి పొందుతారని చిత్రీకరిస్తున్నారు. గిరిజన గ్రామాల్లో హిందూ విగ్రహాల నిర్మాణం, స్థానిక దేవతలను విష్ణువు, శివుడు, దుర్గ రూపాలుగా మార్చడం, గ్రామ సరిహద్దుల్లో హనుమంతుని విగ్రహాలను ప్రతిష్టించడం… ఇవన్నీ ఈ ఆధిపత్య ప్రచారంలో భాగమే.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ఆదివాసీలకు తమ నచ్చిన మతాన్ని ఎంచుకునే పూర్తి హక్కు ఉంది. ఇది మనస్సాక్షికి, మత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. “మోసపూరితమైన” మత మార్పిడులను ఎదుర్కోవడానికి కొన్ని కఠినమైన చట్టాలు కూడా ఉన్నాయి. ఆదివాసీలు హిందూ క్రైస్తవ మతాలను గానీ లేదా మరే ఇతర మతాన్నైనా గానీ ఎంచుకోవచ్చు. అయితే ఒక ఆదివాసీ రాముడిని పూజిస్తాడా లేక యేసును పూజిస్తాడా అనేది ఒక ఆదివాసీగా వారి గుర్తింపుపై ఎలాంటి ప్రభావం చూపదు; ఇది ప్రాథమిక రాజ్యాంగ సూత్రం.
​ రాముడిని పూజించే ఆదివాసీ మాత్రమే ఆదివాసీ సంస్కృతిని వ్యక్తపరుస్తున్నాడని, యేసును పూజించేవాడు దానికి ద్రోహం చేస్తున్నాడని చెప్తూ ఈ సూత్రాన్ని వికృతీకరించడాన్ని అనుమతించకూడదు. ఆదివాసీలు తమ సంప్రదాయ నమ్మకాలు, ప్రకృతి ఆరాధన, వారి ప్రాచీన సంప్రదాయాలు, పద్ధతులకు అధికారిక గుర్తింపు ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఉదాహరణకు, జార్ఖండ్ శాసనసభ జనాభా గణనలో ఆదివాసీల మతం కోసం ప్రత్యేక ‘సర్నా’ స్మృతిని చేర్చాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ మేధావులు, అనేక సంస్థలు పదే పదే చేస్తున్న డిమాండ్. కానీ ప్రభుత్వం ఈ డిమాండును అన్యాయంగా విస్మరించి, ఆదివాసీల విశ్వాసాన్ని అవమానిస్తుంది.

ఆదివాసీలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలు

అమిత్ షా జెఎస్ఎం ప్రచారాన్ని సమకాలీన “ఉల్గులాన్” (మహా తిరుగుబాటు) గా అభివర్ణించడం ద్వారా మరో అడుగు ముందుకు వేశారు. కానీ, బిర్సా ముండా చేపట్టిన ఉల్గులాన్ వలస పాలనకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు – మరీ ముఖ్యంగా, ఆయన క్రైస్తవ మిషనరీలను ఆ పాలనకు సాధనాలుగా చూసినందున వారితో తెగతెంపులు చేసుకున్నారు. దీనికి భిన్నంగా, అమిత్ షా రాజకీయ నేపథ్యం చూస్తే వారి పూర్వీకులు ఎవరూ బ్రిటిష్ వారితో పోరాడిన వారు కానే కాదు. కాగా పోగా ఈ బాపతు వారంతా బ్రిటిష్ వారితో రాజీ పడిన వారి అనుయాయులు. మతం మారిన ఆదివాసీలకు వ్యతిరేకంగా సాగుతున్న మతపరమైన ఒంటెత్తు ప్రచారాన్ని చట్టబద్ధం చేయడానికి వీరుడు బిర్సా పేరును, చారిత్రాత్మక ఉల్గులాన్‌ను అడ్డం పెట్టుకోవడం ఆయన వారసత్వానికి తీవ్రమైన ద్రోహం చేస్తున్నట్లే. సనాతనులు కూడా స్వభావరీత్యా ప్రకృతి ఆరాధకులేనని, “జల్, జంగల్, పహాడ్ (నీరు, అడవి, పర్వతాలు) మన నమ్మకాలకు కేంద్రం” అని కూడా అమిత్ షా ప్రకటించారు.
​ కానీ ఆ మాటలన్నీ ఒట్టి డొల్ల మాటలే. అమిత్ షా మాట్లాడుతున్న సమయంలోనే, ఒడిశాలోని సిజిమాలి, రాయగఢ్‌‌ లలోని గిరిజన సంఘాలు తమ స్వంత ప్రభుత్వం ఆమోదించిన బాక్సైట్ మైనింగ్ నుండి తమ పవిత్ర పర్వతాన్ని రక్షించుకోవడానికి పోరాడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని హస్డియో ప్రాంతంలో, వేలాది మంది ఆదివాసీలు తమ అడవులను ప్రైవేట్ మైనింగ్ కంపెనీలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ సంవత్సరాలుగా పోరాడుతున్నారు. ఈ అడవులను గతంలో “నో-గో జోన్” (మైనింగ్ నిషేధిత ప్రాంతం)గా ప్రకటించారు, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చింది. ఆదివాసీ పండుగలు, ప్రకృతి ఆరాధన వనరుల సమర్థవంతమైన నిర్వహణను ప్రతిబింబిస్తున్నప్పటికీ, ప్రభుత్వాల నిర్ణయాలు వీటికి వ్యతిరేకంగా ఉన్నాయి.
​ ఆదివాసీల ముందున్న అసలు అత్యవసర సమస్యలు ఏంటంటే – అటవీ హక్కుల చట్టాన్ని క్రమంగా నిర్వీర్యం చేయడం, గ్రామసభల హక్కులను వర్చువల్‌గా తొలగించడం, పంచాయతీల (షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరణ) చట్టాన్ని ( పెసా చట్టాన్ని) బలహీనపరచడం, రిజర్వ్‌డ్ పోస్టులలో ఖాళీల భర్తీ పెండింగ్‌లో ఉండటం, ఆదివాసీ విద్యార్థుల హాస్టళ్ల దయనీయ స్థితి, స్కాలర్‌షిప్ చెల్లింపుల బకాయిలు.
ఆదివాసీ ప్రాంతాలలో పౌర, ఆరోగ్య వసతుల కొరత…ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వ మద్దతుతో కార్పొరేట్లు జల్, జంగల్, జమీన్‌లను స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా గానీ, పై సమస్యల పరిష్కారానికి గానీ జెఎస్ఎం ఆదివాసీల హక్కుల కోసం ఏనాడూ గొంతు విప్పలేదు. పైపెచ్చు ఆదివాసీ సమాజాలను మతపరమైన ప్రాతిపదికన విభజించడం ద్వారా, వారిని భూముల నుండి దూరం చేస్తున్న కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకే జెఎస్ఎం పనిచేస్తున్నది. బాధితులను విభజించడం అనేది చరిత్రలో అత్యంత పురాతన వ్యూహం.
​ ఆదివాసీల హక్కుల పరిరక్షణకు కట్టుబడిన వారికి… జెఎస్ఎం సదస్సు, దానికి అండగా నిలిచిన కేంద్ర హోంమంత్రి ప్రకటనలు రాబోయే సవాళ్లకు సంకేతాలు. ఆదివాసీ వీరుల స్ఫూర్తితో ఆదివాసీ సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా ఈ సవాళ్లను నికరంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

brundakarat

 వ్యాసకర్త : సిపిఎం సీనియర్ నేత బృందా కరత్

‘హిందూ’ దినపత్రిక సౌజన్యంతో 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్