న్యూఢిల్లీ: నిరుద్యోగ యువత, విద్యార్థుల ఆవేదనకు ప్రతీకగా ఎదుగుతున్న ‘కొక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)పై అధికార వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా యువత నుంచి ఈ డిజిటల్ ఉద్యమానికి విస్తృత మద్దతు లభిస్తోంది. నీట్ యూజీ పరీక్ష అవకతవకలు, ప్రశ్నపత్రం లీక్లు, నిరుద్యోగం, పరీక్షా వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సీజేపీ సోషల్ మీడియాలో బలమైన ప్రచారం కొనసాగిస్తోంది. అయితే సోషల్ మీడియాలో ‘కొక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ప్రచారంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోందని ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా భావించే పత్రిక ఆర్గనైజర్ లో కథనం వెలువడినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా పెరుగుతున్న విమర్శలు, డిజిటల్ ప్రచారాన్ని ‘అరాచక ధోరణి’గా ఆర్గనైజర్ పేర్కొన్నట్లు ఆ కథనంలో వెల్లడైంది. ఈ ట్రోల్ గ్రూపుల వెనుక విదేశీ ప్రభావం లేదా కుట్ర ఉండొచ్చని కూడా ఆర్గనైజర్ అనుమానం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.
సీజేపీ వ్యవస్థాపకుడిగా చెప్పబడుతున్న అభిజిత్ దీప్కేకు గతంలో బెదిరింపులు వచ్చినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఈ అంశం మరింత చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా, ఇటీవల హ్యాక్కు గురై నిలిచిపోయినట్లు చెప్పబడిన సీజేపీ వెబ్సైట్, సోషల్ మీడియా ఖాతాలను కార్యకర్తలు తిరిగి పునరుద్ధరించినట్లు సమాచారం. ఈ ఏడాది నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్, అవకతవకల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ సీజేపీ ఆన్లైన్ సంతకాల సేకరణ ప్రారంభించింది. ఈ పిటిషన్కు లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు మద్దతు తెలిపినట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు.
నీట్ పరీక్షల వివాదాల కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. కొద్ది కాలంలోనే సీజేపీ సోషల్ మీడియా వేదికలపై విస్తృత ప్రజాదరణ పొందడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.









కామెంట్లు (0)