హవానాపై మరింత ఒత్తిడి పెంచిన ట్రంప్
ఐదు సంస్థలు, నలుగురు వ్యక్తులు కూడా టార్గెట్
వాషింగ్టన్, హవానా : క్యూబాపై ఒత్తిడి పెంచే చర్యల్లో భాగంగా అమెరికా.. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్‘కానెల్పై ఆర్థిక ఆంక్షలు విధించింది. ఆయనతో పాటు మరో నలుగురు వ్యక్తులు, ఐదు సంస్థలను కూడా ఆంక్షల జాబితాలో చేర్చింది. ఈ చర్యతో హవానాపై వాషింగ్టన్ ఒత్తిడి మరింత తీవ్రతరమైందని పరిశీలకులు చెప్తున్నారు.
అధ్యక్షుడితో పాటు కీలక సంస్థలపై ఆంక్షలు
అమెరికా ట్రెజరీ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం… అధ్యక్షుడు డియాజ్‘కానెల్తో పాటు మరికొందరు క్యూబా అధికారులు, సంస్థలపై ఆంక్షలు విధించారు. ఆంక్షలకు గురైన సంస్థల్లో క్యూబా విప్లవ సాయుధ దళాల మంత్రిత్వ శాఖ కూడా ఉంది. 66 ఏళ్ల డియాజ్‘కానెల్ 2018లో అధికారంలోకి వచ్చారు. ఆయన క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో నుంచి బాధ్యతలు _స్వీకరించారు. క్యూబా కమ్యూనిస్టు నాయకత్వంపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా చేపడుతున్న చర్యల్లో భాగంగానే తాజా ఆంక్షలను విశ్లేషకులు చూస్తున్నారు. ఆంక్షల ప్రకటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ… ‘క్యూబా ఒక సరైన దేశంగా ఉండాలని అమెరికా కోరుకుంటోంది’ అని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ మాటల వెనుక ఆంతర్యం వేరనీ, క్యూబాను తన చేతుల్లోకి తెచ్చుకోవాలని ఆయన ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. గతనెలలో కూడా అమెరికా ప్రభుత్వం క్యూబాకు చెందిన 11 మంది అధికారులపై ఆంక్షలు విధించింది. వీరిలో కమ్యూనికేషన్స్ మంత్రి, పలువురు సైనికాధికారులు, క్యూబా ప్రధాన నిఘా సంస్థకు చెందిన అధికారులు ఉన్నారు. ఇటీవల అమెరికా ప్రభుత్వం రౌల్కాస్ట్రోపై హత్య ఆరోపణలు కూడా మోపింది.
95 శాతం క్యూబన్ల మద్దతు ఉంది: ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ క్యూబాను మరోసారి బెదిరించారు. గురువారం ఓవల్ ఆఫీస్లో జరిగిన విలేకరుల సమావేశంలో “మేము దానిని చూసుకుంటాం. వారికి సహాయం చేయాలనుకుంటున్నాం. ట్రంప్నకు చాలా మంది క్యూబన్లు ఓటు వేశారు, అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ 95 శాతం క్యూబన్లు నాకు ఓటు వేశారు” అని ట్రంప్ పేర్కొన్నారు.
ఎంతటి దారుణమైన పరిస్థితులనైనా ఎదుర్కొంటాం : డియాజ్ కానెల్
ట్రంప్ ప్రభుత్వం కాస్ట్రో కుటుంబ సభ్యులతోపాటు తనపైనా, తన సన్నిహిత కుటుంబ సభ్యులపైనా ఆంక్షలు విధించడాన్ని క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్-కానెల్ ఖండించారు. అమెరికా దురాక్రమణ, వికృత వైఖరిని విమర్శించారు. ఎంతటి దారుణమైన పరిస్థితులు ఎదురైనా సామ్రాజ్యవాదంపై తమ పోరాటం కొనసాగుతుందని కానెల్ స్పష్టం చేశారు. రావుల్ కాస్ట్రో కుమారుడితో పాటు, ఆయన మనవడు కూడా అమెరికాకు కంటగింపు అయ్యారన్నారు. అమెరికా దురాక్రమణకు, దిగ్బంధనాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.








కామెంట్లు (0)