అమెరికా దాడిలో మృతి చెందిన భారత నావికా అధికారులకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంతాపం
విజయవాడ : ఒమన్ తీరంలో భారత ఆయిల్ ట్యాంకర్ పై అమెరికా జరిపిన దుర్మార్గమైన దాడిలో ముగ్గురు నావికా అధికారుల మరణం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. ఈ దాడిలో విశాఖ వాసి పట్నాల సురేష్ మృతి చెందటం బాధాకరమని పేర్కొంది. ఆయన మృతికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ నివాళులు అర్పించింది. వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేసింది. దీనిపై శుక్రవారం సిపిఎం రాష్ట కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. అమెరికా దురహంకారానికి ముగ్గురు భారత నావికులు బలైపోయారని, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కేవలం ఇరాన్ నుండి చమురు కొనుగోలు చేసిందనే నెపంతోనే భారత్ నౌకలపై అమెరికా దాడి చేయడం గర్హనీయమన్నారు. భారత వాణిజ్య నౌకలపై అమెరికా నావికాదళం ఈ వారం రోజుల్లోనే 3 సార్లు దాడి జరిపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బేషరతుగా అమెరికాకు వత్తాసు పలకడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. అమెరికా ఆంక్షలకు లోబడి ఉన్నప్పటికీ భారత నౌకలపై దాడి చేయడం మన సార్వభౌమాధికారాన్ని సవాలు చేయడమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం లొంగుబాటుతనానికి ఇది అద్దం పడుతోందని, దీనిపై మోడీ మౌనం దేశ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుందని ధ్వజమెత్తారు. పశ్చిమాసియాలో అమెరికా దాడులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నదన్నారు. అమెరికా దుర్మార్గాలను ప్రతి ఒక్కరు ఖండించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.








కామెంట్లు (0)